పీకే చిత్రంపై చేతులెత్తేసిన కేంద్రమంత్రి రాజ్యవర్ధన్, యూపీలో నో ట్యాక్స్
న్యూఢిల్లీ: అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రాన్ని అడ్డుకోవడం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిమితికి మించి చేయడం అవుతుందని ఆ శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధ్ సింగ్ రాథోడ్ అన్నారు. ఎవరైతై ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారో, వారు కోర్టుకు వెళ్లవచ్చునని చెప్పారు.
ఏ సినిమాను అయినా చూడకుండా అడ్డుకునే న్యాయపరమైన హక్కు సమాచార శాఖకు లేదని చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిందన్నారు. పీకే సినిమా పైన దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్, విస్వహిందూ పరిషత్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ బోర్డు అనుమతి వచ్చాక తాము చర్యలు తీసుకోలేమన్నారు.
పీకే చిత్రం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువతెత్తున్న విషయం తెలిసిందే. పీకే చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని, వాటిని అడ్డుకోవాలని వీహెచ్పీ బుధవారం కూడా డిమాండ్ చేసింది. సినిమాను నిషేధించాలని ఢిల్లీలో వీహెచ్పీ డిమాండ్ చేసింది. మరోవైపు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పీకే చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చింది.
పీకేపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి
పీకే చిత్రం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సినిమాలో ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉందా అని పరిశీలించనున్నదని తెలుస్తోంది. కవేళ అవసరమైతే ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, పీకే చిత్రం పైన ఎలాంటి విచారణకు ఆదేశించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.