నాపై ఆసక్తి కనబర్చాడు... లెక్క చేయనందుకే ఇరికించాడు.. బీజేపీ మహిళా నేత సంచలన ఆరోపణలు
డ్రగ్స్తో పట్టుబడ్డ పశ్చిమ బెంగాల్ బీజేవైఎం నేత పమేలా గోస్వామి తమ పార్టీకే చెందిన రాకేశ్ సింగ్పై సంచలన ఆరోపణలు చేశారు. రాకేశ్ సింగే తనను ఈ కేసులో ఇరికించారని తొలి నుంచి ఆరోపిస్తున్న ఆమె... గురువారం(ఫిబ్రవరి 25) ఎన్డీపీఎస్ కోర్టులో అతనిపై సంచలన ఆరోపణలు చేశారు. రాకేశ్ సింగ్ తన పట్ల ఆసక్తి కనబర్చారని... కానీ అతన్ని తాను లెక్క చేయలేదని... ఈ నేపథ్యంలోనే కుట్రపూరితంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపించారు.
బెంగాల్ డ్రగ్స్ కేసు : బీజేపీ కీలక నేత రాకేశ్ సింగ్,అతని కుమారులు అరెస్ట్...
బాధితురాలిగా మిగిలాను : పమేలా గోస్వామి
పమేలా గోస్వామి ఐదు రోజుల కస్టడీ పూర్తవడంతో పోలీసులు ఇవాళ ఆమెను ఎన్డీపీఎస్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు తన వాదన వినిపించిన పమేలా గోస్వామి... 'నేనో కుట్రలో బాధితురాలిగా మిగిలాను. ఒకవేళ రాకేశ్ సింగ్కు డ్రగ్స్తో లింకు లేకపోతే.. బెంగాల్ విడిచి పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారు. పారిపోయే ప్రయత్నంలోనే గాల్సిలో ఆయన పోలీసులకు పట్టుబడ్డారు కదా.' అని పేర్కొన్నారు.
నా పట్ల రాకేశ్ సింగ్ ఆసక్తి... కాదన్నందుకే ఇలా : పమేలా
'రాకేశ్ సింగ్ చాలా కాలంగా నా పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. కానీ నేను అతన్ని లెక్క చేయట్లేదు. దీంతో నాపట్ల కోపం,కక్ష పెంచుకున్నాడు. గతంలోనూ నాపై చాలా కుట్రలు చేశాడు. శారీరకంగానూ వేధించాడు. అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే... నన్ను బెదిరింపులకు గురిచేశాడు. ముఖంపై యాసిడ్ పోస్తాని,నావాళ్లను చంపేస్తానని బెదిరించాడు.ఇప్పుడిలా నా కారులో డ్రగ్స్ పెట్టించి నాపై కుట్ర చేశాడు. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఇలాంటి కుట్రలేవో జరుగుతున్నట్లు నేను పసిగట్టాను. అక్రమ ఆయుధాల కేసులో ఇరికించడమేమైనా చేస్తారేమో అనుకున్నా... కానీ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడుతానని అనుకోలేదు.' అని పమేలా గోస్వామి తన వాదన వినిపించారు. కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు 'భారత్ మాతాకీ జై' అంటూ ఆమె నినాదాలు చేయడం గమనార్హం.
సీఐడీ విచారణ కోరుతున్న పమేలా
ఈ కేసులో సీఐడీ విచారణ జరిపించాలని పమేలా గోస్వామి డిమాండ్ చేస్తున్నారు. గత శుక్రవారం (19) తన కారులో కొకైన్ తరలిస్తుండగా ఆమె పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఇదంతా బీజేపీ నేత రాకేశ్ సింగ్ తనపై చేసిన కుట్ర అని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు రాకేశ్ సింగ్ మాత్రం.. తన పైనే కుట్ర జరిగిందని,అందుకే పమేలా తన పేరు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. డర్టీ పాలిటిక్స్ పట్ల తనకు నమ్మకం లేదన్నారు. ఇదే క్రమంలో రాకేశ్ సింగ్ బెంగాల్ను విడిచి పారిపోయేందుకు యత్నిస్తుండగా గాల్సిలో రెండు రోజుల క్రితం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర బీజేపీలో ఈ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ సింగ్... బెంగాల్ బీజేపీ ఇన్చార్జి కైలాష్ విజయ్ వర్గియాకు సన్నిహితుడు కావడం గమనార్హం.