40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ -ఇక దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం -మోదీ‘ఆందోళన్ జీవి’కి టికాయత్ కౌంటర్
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారం నాటికి 76వ రోజుకు చేరాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతుల ఆందోళనలపై కేంద్రం ఉక్కుపాదం మోపడం, రెండు వారాలుగా చర్చల ప్రక్రియ నిలిచిపోవడం, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనూ కేంద్రం ఎదురుదాడినే కొనసాగిస్తున్న నేపథ్యంలో రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన
ఢిల్లీ శివారుల్లో కొనసాగుతోన్న ఉద్యమంలో ప్రధానంగా మూడు రాష్ట్రాల రైతులే అధిక సంఖ్యలో ఉండటం, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కదలిక వచ్చినా, ఉద్యమం దేశవ్యాప్తం కాలేదు. ఆ లోటును పూరించుకుంటూ, అగ్రి చట్టాలపై పోరును దేశవ్యాప్తం చేయబోతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. అందుకోసం..
40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని, రైతుల ఉద్యమాన్ని దేశ వ్యాపితం చేస్తామని రైతు సంఘాల నేత టికాయత్ చెప్పారు. దేశ వ్యాప్త ఆందోళన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని, అనంతరం కూడా ఆందోళన కొనసాగుతుందని, రైతులంతా దశల వారీగా మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారని వివరించారు. మంగళవారం హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన మహా పంచాయత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇక రైతుల ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపైనా రాకేశ్ మండిపడ్డారు.
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ
''ప్రధాని మోదీ తన జీవితంలో ఒక్క ఆందోళన చేసిన దాఖలాలు కూడా లేవు మరి. చరిత్రలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్లతో పాటు ఆఖరికి లాల్ క్రిష్ణ అద్వాణీ కూడా ఆందోళనలు చేపట్టారు. కానీ మోదీ తన జీవితంలో ఒక్కసారి కూడా ఆందోళనలో పాల్గొనలేదు. ఆయన దేశాన్ని విభజించడానికే పని చేశారు, ఇంకా అదే పనిలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తి మమ్మల్ని ఆందోళన జీవులంటూ ఎద్దేవా చేయడమేంటి?'' అని రాకేష్ టికాయత్ మండిపడ్డారు.