ఆర్పీఐలో చేరిన ఐటం గర్ల్ రాఖీ సావంత్, థాకరేపై రెడీ
ముంబై: ప్రముఖ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ శనివారం రామదాస్ అథావలే సారథ్యంలోని ఆర్పీఐ(ఏ) పార్టీలో చేరారు. ఆమెను ఆర్పీఏ(ఏ) మహిళా విభాగం సారథిగా పార్టీ అధ్యక్షులు అథావలే ప్రకటించారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ థాకరే పైన పోటీ చేసేందుకు తాను వెనుకాడబోనని ఆమె ప్రకటించారు.
తాను అసలు ఎవరిని చూసి జడిసే ప్రసక్తి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోకసభ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాఖీ సావంత్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. ఆమెకు 1995 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఆ ఎన్నికల్లో రాఖీ సావంత్ తాను స్థాపించిన రాష్ట్రీయ ఆమ్ పార్టీ తరఫున ఆమె ముంబై నార్త్ వెస్ట్ లోకసభ స్థానానికి పోటీ చేశారు. శివసేన పార్టీ సీనియర్ నేత గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, కాంగ్రెస్ సీనియర్ నేత కామత్ గురుదాస్ వసంత్, మాయాంక్ రమేష్ (ఆమ్ ఆద్మీ పార్టీ)లు ఈ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. అయితే రాఖీ సావంత్ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం ఆమె తన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె బిజెపిలో చేరుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఇన్నాళ్లకు ఆమె ఆర్పీఐలో చేరారు.