నన్ను ప్రియాంకతో పోల్చొద్దు: ఉమాపై రాఖీ సావంత్
న్యూఢిల్లీ: తనను కాంగ్రెసు నేత ప్రియాంక వాద్రాతో పోల్చడం మానేయాలని ఐటం గర్ల్ రాఖీ సావంత్ బిజెపి నేత ఉమా భారతికి సూచించారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోకసభ ఎన్నికల్లో రాఖీ సావంత్ పోటీ చేసిన విషయం తెలిసిందే. కొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. మీ రాజకీయాల్లోకి తనను లాగవద్దని, తనను ప్రియాంక గాంధీ వాద్రాతో పోల్చవద్దని ఆమె ట్వీట్ చేశారు.
తాను సామాన్య మహిళనని ఆమె అన్నారు. రాఖీ సావంత్ చాలా మాట్లాడుతారని, అయితే అందులో ఏ విధమైన అర్థం ఉండదని ఉమా భారతి అన్నారు. మోడీ, బిజెపిపై ప్రియాంక దాడిని పురస్కరించుకుని ఆమె ఆ విధంగా అన్నారు.
తన తల్లి సోనియా పోటీ చేస్తున్న రాయబరేలీలో, తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తనున్న అమేథీలో ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రియాంక గాంధీ - బిజెపి, మోడీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు
ఉమా భారతి వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ఇంకా స్పందించాల్సే ఉంది. ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్తారని కూడా ఉమా భారతి అన్నారు.