ఇమ్రాన్ఖాన్ సర్! మా మొద్దు ఇండియన్స్కు చెప్పండి: మూడు పెళ్లిళ్లపై రామ్ గోపాల్ వర్మ
ముంబై: జమ్ము కాశ్మీర్ పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన విమర్శలు గుప్పించారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లు చేశారు.
చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని నీవు భావిస్తే నీవు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదని ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండని, కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తామని సెటైర్ వేశారు.
ఒసామా బిన్ లాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకి తెలుస్తుందని, కానీ మీకు తెలియదని, అలాంటప్పుడు మీది అసలు దేశమేనా చెప్పాలని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. చెప్పండి సార్.. ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు.. మాకు కొంచం తెలివితేటలు నేర్పండని పేర్కొన్నారు.
జైష్ ఏ మొహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని తనకు ఎవరూ చెప్పలేదని, కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదన్నారు.
జైష్ ఏ మొహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత్ పెవిలియన్లోకి విసురుతున్నారని, కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబ్స్ అనుకుంటున్నారా.. కాస్త చెప్పాలని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ సార్.. దయచేసి మాకు తెలివి తేటలు నేర్పండి అని ఎద్దేవా చేశారు.