రామనామాన్ని జపించిన రాహుల్ గాంధీ: శ్రీరాముడికి అసలు నిర్వచనం ఇదేనంటూ: టచ్ చేసేలా
అయోధ్య: కాంగ్రెస్.. దేశ రాజకీయాల్లో సెక్యులర్ పార్టీ అనే గుర్తింపును పొందింది. ఏ ఒక్క మతానికో లేదా ఏ ఒక్క కులానికో తాము ప్రాతినిథ్యాన్ని వహించట్లేదనే సంకేతాన్ని ఇదివరకు చాలాసార్లు పంపించింది. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో తప్ప మతపరమైన కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు కాంగ్రెస్ నేతలు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే ముద్ర ఉండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సారి దీనికి భిన్నంగా స్పందించింది. అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా శ్రీరాముడిని కీర్తించింది.
లౌకికవాద పార్టీగా..
ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, పార్టీ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చర్చనీయాంశమౌతోంది. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కొన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. వాటిని తప్పు పట్టిన ఎన్నికల ప్రచార స్టంట్గా అభివర్ణించిన భారతీయ జనతా పార్టీ నాయకులు సంధించిన ప్రశ్నలకు వారి శైలిలోనే సమాధానాలను ఇచ్చారు. తాను నిఖార్సియన కాశ్మీరీ బ్రాహ్మణుడినని చెప్పుకొన్నారు. తన గోత్రనామం ఏమిటో వెల్లడించారు.
రాముడి గురించి వర్ణించిన రాహుల్..
తాజాగా మరోసారి ఆయన తన వైఖరిని చాటుకున్నారు. అయోధ్యలో శిలాన్యాస్ కార్యక్రమం ముగిసిన వెంటనే.. శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ ట్వీట్ చేశారు. శ్రీరాముడు సద్గుణాల సుసంపన్నుడని పేర్కొన్నారు. మానవత్వానికి నిలువుటద్దమని అన్నారు. మానవీయ గుణాలకు అత్యుత్తమ స్వరూపమని అన్నారు. అందుకే శ్రీరాముడిని అందరూ మర్యాద పురుషోత్తముడిగా పూజిస్తారని చెప్పారు. `రాముడు అంటే ప్రేమ.. అది ఎప్పుడూ ధ్వేషంగా మారదు.. రాముడంటే కరుణ..అది ఎప్పుడూ క్రూరత్వ రూపాన్ని సంతరించుకోదు. రాముడంటే న్యాయం.. అది ఎప్పుడూ అన్యాయంగా మారదు..`అంటూ రాజీవ్ గాంధీ ట్వీట్ చేశారు.
గాంధీ కుటుంబం నుంచి తొలిసారిగా..
శ్రీరామచంద్రుడి పట్ల గానీ, హిందూయిజం పట్ల గానీ మొదటిసారిగా గాంధీ కుటుంబానికి చెందిన ఓ నాయకుడు గొప్పగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. పూర్తిగా లేవని కొట్టి పారేయలేం గానీ.. ప్రత్యేక సందర్భాలను పక్కన పెడితే.. సాధారణంగా గాంధీ కుటుంబం గానీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు గానీ కోదండరాముడిని, హిందూమతానికి అనుకూలంగా వ్యాఖ్యనాలు చేసిన సందర్భాలు తక్కువే. అలాంటి పరిస్థితుల్లో.. పైగా భారతీయ జనతా పార్టీ తన పేటెంట్గా భావిస్తోన్న రామమందిరం నిర్మాణానికి భూమిపూజ పడిన సమయంలో రాహుల్ గాంధీ అనుకూల ట్వీట్ పెట్టడం చర్చనీయాంశమౌతోంది.
Recommended Video
ఇంతకుముందు.. ప్రియాంక గాంధీ..
ఇంతకుముందు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా రామమందిరం భూమిపూజ కార్యక్రమానికి అనుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆమె శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఓ లేఖ రాశారు. రామమందిర నిర్మాణానికి పూనుకుంటోన్న వేళ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. మందిర నిర్మాణం కల సాకారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సైతం రామమందిరానికి అనుకూలంగా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమం దేశంలో నెలకొన్న శాంతి సారస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోదర భావానికి అద్దం పడుతోందని చెప్పారు.