స్వాతి హత్య కేసులో రామ్ కుమార్ ఇరుక్కున్నట్లే..
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ తప్పించకోవడానికి వీలు లేకుండా దర్యాప్తు అధికారులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. తాము రామ్ కుమార్ గొంతు కోసినట్లు చేస్తున్న ఆరోపణలు కేసును తప్పు దారి పట్టించడానికేనని వారు అభిప్రాయపడుతున్నారు. రామ్ కుమార్ స్వాతిని హత్య చేశాడని చెప్పడానికి తగిన ఆధారాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.
ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు తిరగబడుతోందా?
స్వాతిని రామ్కుమార్ హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్షసాక్షులు ఉన్నారని, అంతకు ముందు ఆమెను పలుమార్లు వెంబడించాడని చెప్పటానికి కూడా సాక్షులు ఉన్నారని పోలీసులు అంటున్నారు. రామ్కుమార్ ధరించిన చొక్కాపైని రక్తం స్వాతిదేనని ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు వారు చెబుతున్నారు. త్వరలోనే ఛార్జిషీటును దాఖలు చేయనున్నామని ఆయన చెప్పారు.
స్వాతి హంతకుడు రామ్కుమారేనని నిర్ధారించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించామని వారు చెప్పారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో పుళల్ సెంట్రల్ జైలులో ఉన్న రామ్కుమార్ను విచారించామని చెప్పారు. కోర్టు ఆదేశాలమేరకు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపినప్పుడే రామ్కుమార్ స్వాతిని తానే హత్య చేశానని వాంగ్మూలం ఇచ్చాడని వారంటున్నారు.
హత్యాస్థలమైన నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో తాను ఎలా హత్య చేసి పారిపోయిందీ రామ్ కుమార్ నటించి చూపాడని, వీటికి సంబంధించి వీడియో తీసి భద్రపరిచామని, ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదికలను కోర్టులో సమర్పించనున్నామని దర్యాప్తు అధికారులు అంటున్నారు.
పోలీసులు రామ్కుమార్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు అతడు తన గొంతును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, పోలీసులు తన కుమారుడి గొంతును కోశారని న్యాయవాదులతో కలిసి రామ్కుమార్ తండ్రి పరమశివం ఆరోపించడం పోలీసు వర్గాల్లో సంచలనం కలిగించింది. అయితే రామ్కుమార్ హంతకుడని చెప్పడానికి తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో ఇలాంటి అబద్దపు ఆరోపణలు వల్ల కేసు తప్పుదోవపట్టే అవకాశం లేదని అంటున్నారు.