మీరు కన్నుమూసేలోగా రామమందిరాన్ని చూస్తారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో అడ్వొకేట్ పరాశరన్ భేటీ
ముంబై: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలవరించిన ప్రతిష్ఠాత్మక తీర్పుతో పాటు ప్రముఖంగా వినిపించిన పేరు కే పరాశరన్. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్. అయోధ్యపై కేసు విషయంలో రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున వాదించిన న్యాయవాది. 93 సంవత్సరాల వయస్సులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణకు ఏ ఒక్కరోజు కూడా గైర్హాజర్ కాలేదు. విచారణ కొనసాగినంత సేపూ నిల్చునే తన వాదనలను వినిపించారు. చివరికి- పరాశరన్ వినిపించిన వాదనలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించడం, ఆయన వాదనలను వినిపించిన రామ్ లల్లా విరాజ్ మాన్ కే వివాదాస్పద స్థలం దక్కుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
తీర్పు వెలువడిన మరుసటి రోజే..
ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ తో సమావేశం అయ్యారు. నాగ్ పూర్ లోని ఆయన నివాసానికి ప్రత్యేక విమానంలో వెళ్లారు. రామ్ లల్లా విరాజ్ మాన్ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో- పరాశరన్ ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన మోహన్ భగవత్ తో సమావేశం అయ్యారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సానుకూల వాతావరణంలో ముగిసిన నేపథ్యంలో మర్యాదపూరకంగానే ఆయన మోహన్ భగవత్ ను కలుసుకున్నారని చెబుతున్నారు.
కన్ను మూసేలోగా రామమందిరాన్ని చూస్తారంటూ..
`ఇప్పుడు నా వయస్సు 93 సంవత్సరాలు. ఈ వయస్సులో అయోధ్య భూవివాదంపై వాదనలను వినిపిస్తున్నాను. ఎన్ని రోజులు జీవిస్తానో తెలియదు. తుదిశ్వాస విడిచే లోగా రామ మందిరం నిర్మాణాన్ని చూడాలనేది నా కోరిక.. ` పరాశరన్ తరచూ చెప్పే మాటలు ఇవి. దీన్ని నిజం చేస్తామని మోహన్ భగవత్ ఈ సందర్భంగా పరాశరన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కన్ను మూసేలోగా రామమందిరం నిర్మాణం జరుపుకోవడాన్ని చూసేలా చేసే బాధ్యత తనదని మోహన్ భగవత్ ఈ సందర్భంగా పరాశరన్ కు భరోసా ఇచ్చారని అంటున్నారు.
శాలువ కప్పి.. జ్ఞాపికలను అందజేసి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై ఏర్పాటైన అయిదుమంది సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా అంగీకరించేలా పరాశరన్.. రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున వాదనలను వినిపించారని, ఇది చాలా గొప్ప విషయమని మోహన్ భగవత్ ప్రశంసించినట్లు తెలుస్తోంది. అయిదుమంది సభ్యుల ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ నజీర్ సైతం పరాశరన్ వినిపించిన వాదనలను కాదనలేకపోయారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన పరాశరన్ కు శాలువ కప్పి సన్మానం చేశారు. జ్ఞాపికను అందజేశారు.
రామ మందిరం నిర్మాణంపై
ఈ సందర్భంగా పరాశరన్, మోహన్ భగవత్ మధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో కొనసాగుతోన్న శిల్పాల పనులు ప్రస్తుతం ఆగిపోయాయని, దీన్ని పునరుద్ధరించాల్సి ఉందని మోహన్ భగవత్ వివరించారు. రామమందిర నిర్మాణం, అయోధ్య అభివృద్ధి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో రామమందిరం నిర్మాణానికి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండబోవని, మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.