అయోధ్య రామ్మందిర్ ట్రస్ట్ అధ్యక్షుడిగా గోపాల్దాస్: నిర్మాణ కమిటీకి మోడీ మాజీ ప్రధాన కార్యదర్శి
Recommended Video
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్ విషయంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు కొత్త అధ్యక్షుడితోపాటు కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు.
మహంత్ నృత్య గోపాల్దాస్ను ట్రస్టుకు నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్, కోశాధికారిగా గోవింద్ గిరి నియమితులయ్యారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నూతన అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మీడియాతో మాట్లాడారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్ అదే విధంగా ఉంటుందని, కానీ ఎత్తు, వెడల్పులో పెరుగుల ఉంటుందని చెప్పారు.
విరాళా కోసం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించడానికి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ తరపున అవినాశ్ మహంతి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ కుమార్ జా పాల్గొన్నారు. కాగా, మరో 15 రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ట్రస్ట్ సభ్యులు ప్రకటించనున్నట్లు తెలిసింది.