అయోధ్యకు రండి: ప్రధాని మోడీని కలిసిన రామ్ మందిర్ ట్రస్ట్ సభ్యులు
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సభ్యులు గురువారం ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అయోధ్య సందర్శనకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీని ట్రస్ట్ సభ్యులో కోరారు.
బుధవారం ట్రస్ట్ తొలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజైన గురువారం ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీని అయోధ్య సందర్శనకు రావాలని ఆహ్వానించినట్లు గోపాల్ దాస్ తెలిపారు. ఆలయ నిర్మాణంపై చర్చించినట్లు తెలిపారు. కాగా, అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది. బుధవారం సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో జరిగిన ట్రస్ట్ తొలి సమావేశంలో నృత్య గోపాల్ దాస్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చంపత్ రాయ్ను ప్రధానకార్యదర్శిగా, కోశాధికారిగా గోవిందగిరిని నియమించారు. కాగా, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆలయ నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నూతన అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మీడియాతో మాట్లాడారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్ అదే విధంగా ఉంటుందని, కానీ ఎత్తు, వెడల్పులో పెరుగుల ఉంటుందని చెప్పారు.
విరాళా కోసం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించడానికి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ తరపున అవినాశ్ మహంతి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ కుమార్ జా పాల్గొన్నారు. కాగా, మరో 15 రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ట్రస్ట్ సభ్యులు ప్రకటించనున్నట్లు తెలిసింది.