అయోధ్యలో రామమందిరం ఎలా నిర్మిస్తామో చూస్తూ ఉండండి : సాధ్వీ ప్రగ్యాసింగ్
ఇండోర్: జమ్మూ కశ్మీర్లో అసాధ్యమనుకున్న ఆర్టికల్ 370ని ఎలాగైతే రద్దు చేసి సుసాధ్యం చేశామో... అయోధ్యలో కూడా రామమందిరం నిర్మాణం చేస్తామని చెప్పారు భోపాల్ ఎంపీ ప్రగ్యా సాధ్వీ. అంతేకాదు రామమందిరం నిర్మాణం పూర్తయ్యేవరకు తనకు ఏమీ కాదని అప్పటి వరకు తాను ఆరోగ్యంగానే ఉంటానని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అయ్యాక ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగిందని అదే సమయంలో అయోధ్యలో కూడా రామమందిరం నిర్మాణం పూర్తి చేస్తామని అది దేశ ప్రజలు వీక్షిస్తారని చెప్పారు.
ఈ మధ్యకాలంలోనే ఉత్తర్ప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా అయోధ్య రామమందిర నిర్మాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హయాంలోనే రామమందిర నిర్మాణం ప్రారంభమై పూర్తవుతుందని చెప్పారు. అంతేకాదు యోగీ ఆదిత్యనాథ్ చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పారు. అంతేకాదు యోగీ ఆదిత్యనాథ్ చేతుల్లో అపారమైన శక్తి ఉందని కొనియాడారు మంత్రి సునీల్ భరాలా. ఇదిలా ఉంటే అయోధ్యపై రోజువారీ వాదనలు సుప్రీంకోర్టులో జరుగుతున్నాయని చెప్పిన మంత్రి సునీల్... కచ్చితంగా తీర్పు రామమందిరం నిర్మాణంకు మద్దతుగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ తీర్పును ముస్లిం సామాజిక వర్గం కూడా స్వాగతిస్తుందని జోస్యం చెప్పారు.
ఇదిలా ఉ:టే 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని మూడు వర్గాల వారికి సమానంగా పంచాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకారా, రామ్ లల్లాల మధ్య సమానంగా పంచాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంది.