రామ మందిర నిర్మాణం ప్రారంభం: భూకంపాలు, విపత్తులకు చెక్కు చెదరదు, మూడేళ్లలోనే పూర్తి
న్యూఢిల్లీ: ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ మందిర నిర్మాణంపై చర్చించేందుకు గురువారం న్యూఢిల్లీలో ట్రస్ట్ సభ్యులు, సంబంధిత వ్యక్తులు సమావేశమయ్యారు.
Recommended Video
పురాతన సాంకేతిక పద్ధతిలోనే.. విపత్తులకు చెక్కు చెదరదు..
రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎప్పకటిప్పుడు తెలియజేస్తామని ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదని, భారతీయ పురాతన సాంకేతిక పద్ధతులలోనే నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. భూకంపాలు, తుఫానులు, ఇతర ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేలా నిర్మాణం ఉంటుందని స్పష్టం చేసింది.
రామ మందిర నిర్మాణం ప్రారంభం..
శ్రీరామ జన్మభూమిలో మందిర నిర్మాణం ప్రారంభమైందని ట్రస్ట్ పేర్కొంది.భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కళాశాలలు సీబీఆర్ఐ రూర్కీ, ఐఐటీ మద్రాసు, ఎల్అండ్టీ నుంచి నిపుణులైన ఇంజినీర్లు వచ్చి మందిర నిర్మాణం చేపట్టనున్న ప్రదేశంలో భూమిని పరీక్షిస్తున్నారని వెల్లడించింది. 30-40 నెలల్లో రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది.
నాగరా వాస్తు శిల్ప శైలిలో.. మూడంతస్తులు, ఐదు గోపురాలు
నాగరా వాస్తుశిల్ప శైలిలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని, మూడు అంతస్తుల, ఐదు గోపురాలు ఉంటాయని తెలిపింది. ఇంతకుముందు నిర్మాణంలో రెండు గోపురాలే ఉండవని తెలిపింది. అసలు ఆలయం కంటే రెండింతలు పెద్దదిగా ఈ ఆలయం ఉంటుందని పేర్కొంది. 10 ఎకరాల్లో నిర్మించే ఈ ఆలయంలో మొత్తం 360 పిల్లర్లు ఉంటాయని, మందిర సముదాయం మొత్తం 57 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని ట్రస్ట్ వివరించింది.
దేశంలోనే అతిపెద్దదిగా మందిర గర్భగుడి..
మందిరంలో గర్భగుడి నిర్మాణం భారీగా ఉంటుందని, 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతి పెద్దదిగా ఉంటుందని తెలిపింది.ఈ అద్భుత నిర్మాణం 2023 నాటికి పూర్తవుతుందని, నేటి నుంచి మూడేళ్లలోపు ఆలయం రూపుదిద్దుకుంటుందని వివరించారు. కాగా, ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిథ్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హాజరయ్యారు.