మట్టింట్లో పుట్టాను: భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్హాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. తాను ఓ చిన్న గ్రామంలో మట్టింట్లో పుట్టి ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.
దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. పూర్తి గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశంగా మనం ఎన్నో మైళు రాళ్లను దాటామని చెప్పారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం భారత్ సొంతమని కోవింద్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్, అబ్దుల్ కలాం, ప్రణబ్ముఖర్జీ అడుగుజాడల్లో తాను నడుస్తానని ప్రసంగంలో వెల్లడించారు.
కాగా, కోవింద్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ , ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విదేశీ దౌత్యాధికారులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి గా బరిలో దిగిన రామ్నాథ్.. విపక్ష అభ్యర్థి మీరాకుమార్పై 65.5 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా కోవింద్ గుర్తింపు పొందారు.