ఓ కుక్క చనిపోతే సమాధానం చెప్పాలా?: గౌరీ లంకేష్పై ప్రమోద్ ముతాలిక్
న్యూఢిల్లీ: కర్ణాటకలో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ఓ కుక్క అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆమె హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని వస్తున్న విమర్శలపై ఆయన అంతే ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే దానికి మోడీ ఎందుకు స్పందించాలన్నారు.
'గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని మోడీ మాట్లాడాలని చాలామంది చెబుతున్నారు. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మోడీ ఎందుకు స్పందించాలి?' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ హయాంలో జరిగిన హత్యలపై ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయని చెప్పారు. అప్పుడు ఎవరూ కాంగ్రెస్ను ఎందుకు తప్పుబట్టలేదో చెప్పాలన్నారు. కానీ ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆయన ఆ మాటలు చెప్పగానే చాలామంది కార్యకర్తలు జై శ్రీరాం అని నినాదాలు చేశారు.
అయితే, ముతాలిక్ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు ప్రధాని సమాధానమివ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడనని, అంతేకానీ గౌరీ లంకేశ్ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదన్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో నిందితుడు పరుశురామ్ను సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.