రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతి
లక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వచ్చేనెల 5వ తేదీన భూమిపూజను నిర్వహించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ట్రస్టు ప్రతినిధులు.
ఇక్కడే కొత్త వివాదం తలెత్తుతోంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిపూజను చేయడానికి ట్రస్ట్ నిర్ధారించిన సమయం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. అశుభ ఘడియల్లో ఆలయ నిర్మాణానికి భూమి పూజను చేయబోతున్నారని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వెల్లడించారు. ఈ సమయాన్ని మార్చాలని ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే రామమందిరం నిర్మాణానికి ఎంచుకున్న సమయ ప్రభావం ఆలయ నిర్మాణంపై పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
తాను శ్రీరామచంద్రుడి భక్తుడినని, అందరిలాగే తాను కూడా రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. భూమిపూజను రాజకీయం చేయదలచుకోలేదని చెప్పారు. కోట్లాదిమంది హిందువులు మందిరం నిర్మాణానికి విరాళాలను ఇస్తున్నారని, భూమిపూజ ముహూర్తంపై భక్తుల అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి చెప్పారు. వీలైతే భూమిపూజ సమయాన్ని మార్చడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.
కాంబోడియాలోని అంకోర్వాట్ ఆలయం తరహాలో రామమందిరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని శంకరాచార్య అన్నారు. శతాబ్దాలు గడిచినా అంకోర్వాట్ చెక్కు చెదరలేదని చెెప్పారు. 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తులు కాంబోడియాలో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఇన్ని శతాబ్దాల కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఉండొచ్చని అయినప్పటికీ.. ఆ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయాయని అన్నారు. ఆ స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా శ్రీరామచంద్రుడి అపురూప ఆలయాన్ని నిర్మించాల్సి ఉందని చెప్పారు.