అయోధ్య వివాదం పెద్దదే: నితీష్, లాలూల పాత్ర కోసం...
వివాదాస్పద బాబ్రీ మసీద్ - రామ మందిరం వివాద పరిష్కారం కోసం చర్చలు జరిపి ముస్లింలను ఒప్పించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్లను బీజేపీ అభ్యర్థించింది.
పాట్నా/ న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్రీ మసీద్ - రామ మందిరం వివాద పరిష్కారం కోసం చర్చలు జరిపి ముస్లింలను ఒప్పించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్లను బీజేపీ అభ్యర్థించింది. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ ఈ మేరకు గురువారం నితీశ్, లాలూలకు విజ్నప్తి చేశారు.
ముస్లింలతో వారిద్దరికి గల సత్సంబంధాలను వివాద పరిష్కారం కోసం వినియోగించాలని నితీశ్, లాలూలను కోరుతూ ఒక ప్రకటన చేశారు. 'బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లకు గల ముస్లింలతో సత్సంబంధాలు ద్రుష్ట్యా అయోధ్య వివాదానికి సమయోచిత పరిష్కారం కోసం సమస్యల పరిష్కారానికి వారితో సంప్రదింపులు జరుపాలి' అని ఒక ప్రకటనలో కోరారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రదాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలకు సంప్రదాయ రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు పలికారని సుశీల్ కుమార్ మోడీ గుర్తు చేశారు.
సుప్రీం ఆదేశాలను స్వాగతించిన సుశీల్
అయోధ్య వివాదంలో వాది, ప్రతివాదులు తమ వాదానికి కట్టుబడి ఉండకుండా, వాస్తవాల ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి పూనుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కోరిందని సుశీల్ కుమార్ మోడీ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు.
మసీద్ వివాదం ఈనాటిది కాదు
16వ శతాబ్ది నాటి మసీదును 25 ఏళ్లనాడు 1992 డిసెంబర్ ఆరో తేదీన కూల్చివేసినప్పటి నుంచి ఇప్పటికీ వివాదం అపరిష్క్రుతంగానే ఉన్నది. గత మంగళవారం బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. న్యాయస్థానం బయట ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అందుకు అవసరమైతే తానూ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ పేర్కొనడం గమనార్హం.. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు - రామ మందిర వివాదం పూర్వాపరాలు ఒకసారి పరిశీలిద్దాం. బాబ్రీ మసీదును సుమారు 500 ఏళ్ల క్రితం 1528లో అయోధ్యలో తొలి మొగల్ చక్రవర్తి బాబర్ సైనిక కమాండర్ మిర్ బాఖీ ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి దీన్ని బాబ్రీ మసీదుగా పిలుస్తున్నారు.
1853లో తొలిసారి
అవధ్ రాజు నవాబ్ వాజిద్ అలీ షా హయాంలో తొలిసారి 1853లో ఈ పవిత్ర స్థలంపై హక్కుల కోసం హింస చోటు చేసుకుంది. హిందువుల తరఫున వాదిస్తున్న నిర్మోహీలు.. బాబర్ చక్రవర్తి సమయంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదు కూల్చారని ఆరోపించారు. 1859లో బ్రిటిష్ వలస ప్రభుత్వం ఇరుపక్షాలకు సమ న్యాయం చేకూర్చేందుకు పవిత్ర స్థలం మధ్య కంచె ఏర్పాటు చేసింది. ఇన్నర్ కోర్టును ముస్లింల కోసం, హిందువులకు ఔటర్ కోర్టు కేటాయించింది.
రామ్ చబ్రుతా నిర్మాణం అనుమతి కోరుతూ పిటిషన్
మసీదు బయట రామ్ చబుత్రా (ప్లాట్ఫామ్) నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ తొలిసారి కేసు నమోదు చేశారు. కానీ ఈ వినతిని ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానం తిరస్కరించింది.
బయట పడ్డ శ్రీ రాముడి విగ్రహాలు
మసీదు లోపల శ్రీ రాముడి విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని హిందూ సంస్థలే మసీదులో ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇరు పక్షాలు ఈ వివాదాస్పద స్థలం తమదేనని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయోధ్యలోని ఈ స్థలాన్ని వివాదాస్పదమైందని ప్రకటిస్తూ భవనానికి తాళాలు వేయించింది. 1950లో రామ జన్మస్థానంలో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఫైజాబాద్ న్యాయస్థానంలో గోపాల్ సింగ్ విశారద్, మహంత్ పరమహంస రామచంద్ర దాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ కోర్టు ప్రాంగణానికి తాళాలు వేసినా ప్రార్థనలు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. 1959లో రామ జన్మభూమి కస్టోడియన్లుగా తమకు ఈ పవిత్ర స్థలాన్ని అప్పగించాలని కోరుతూ నిర్మోహి అఖారా మూడో పిటిషన్ దాఖలు చేశారు.
వక్ఫ్ బోర్డు పిటిషన్
మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను స్థాపించడానికి వ్యతిరేకంగా, మసీదు పరిసర ప్రాంతాలన్నీ శ్మశాన వాటికకు చెందినవని పేర్కొంటూ వక్ఫ్ సున్నీ సెంట్రల్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది. 1984లో రామజన్మభూమి స్థలంలో దేవాలయం నిర్మాణం కోసం హిందూ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ఎల్ కే అద్వానీ నాయకత్వంలో దేవాలయ నిర్మాణ ఉద్యమం ఊపందుకున్నది.
పూజలకు యూపీ న్యాయస్థానం అనుమతి
హరిశంకర్ దూబే అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఒక జిల్లా న్యాయస్థానం మసీదు గేట్లు తెరిపించి హిందువులు ప్రార్థనలు జరిపేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలిపారు. హిందువులకు ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. 1989లో బాబ్రీ మసీదు పక్కనే గల స్థలంలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) శంకుస్థాపన చేసింది. మసీదును మరో స్థలానికి మార్చాలని కోరుతూ వీహెచ్ పీ మాజీ ఉపాధ్యక్షుడు జస్టిస్ డైకీ నందన్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైజాబాద్ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న నాలుగు కేసులను హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు.
సోమ్నాథ్ నుంచి అయోధ్యకు అద్వానీ రథయాత్ర
సెప్టెంబర్లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. కానీ బీహార్ లో నాటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీని అరెస్ట్ చేశారు. తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వానికి, యూపీలో ములాయం సర్కార్కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. దాని తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ దశలో వీహెచ్పీ వాలంటీర్లు స్వచ్ఛందంగా మసీదును ధ్వంసం చేశారు. నాటి ప్రధాని చంద్రశేఖర్ జోక్యం చేసుకుని చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.
అద్వానీ రథయాత్రతో 1991లో ప్రతిపక్ష పార్టీగా
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమం పుణ్యమా? అని లోక్సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
బాబ్రీ మసీదును కూల్చేసిన కరసేవకులు
వివాదాస్పద బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ ఆరో తేదీన కరసేవక్లు ఆక్రమించారు. ఈ ఉద్యమానికి శివసేన, బీజేపీ, వీహెచ్పీ మద్దతు పలికాయి. దీంతో దేశంలోనే దారుణమైన దాడుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా మరణించారు. దీనిపై నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ప్రభుత్వం అదే ఏడాది డిసెంబర్ 16వ తేదీన జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కమిషన్ను నియమించింది.
ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు
బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రామ మందిరం నిర్మాణమే తమ ధ్యేయమని వీహెచ్పీ పునరుద్ఘాటించింది.
గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ దాడిగుజరాత్ రాష్ట్రంలోని గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో వెళుతున్న ప్రయాణికులపై 2002 ఫిబ్రవరిలో దాడి జరిగింది. ఈ దాడిలో 58 మంది మరణించారు. రైలులో దాడికి గురైన ప్రయాణికులంతా అయోధ్యకు వెళుతున్న కరసేవకులని భావిస్తున్నారు. తదనంతరం దాడుల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. సదరు వివాదాస్పద స్థలంలో తొలుత దేవాలయం ఉన్నదా? లేదా? అన్న సంగతి తేల్చాలని ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ)ని హైకోర్టు ఆదేశించింది. ఈ స్థలం ఎవరిదో తేల్చేసేందుకు హైకోర్టు విచారణ ప్రారంభించింది.
గుజరాత్ రాష్ట్రంలోని గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో వెళుతున్న ప్రయాణికులపై 2002 ఫిబ్రవరిలో దాడి జరిగింది. ఈ దాడిలో 58 మంది మరణించారు. రైలులో దాడికి గురైన ప్రయాణికులంతా అయోధ్యకు వెళుతున్న కరసేవకులని భావిస్తున్నారు. తదనంతరం దాడుల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. సదరు వివాదాస్పద స్థలంలో తొలుత దేవాలయం ఉన్నదా? లేదా? అన్న సంగతి తేల్చాలని ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ)ని హైకోర్టు ఆదేశించింది. ఈ స్థలం ఎవరిదో తేల్చేసేందుకు హైకోర్టు విచారణ ప్రారంభించింది.
2003లో సర్వే ప్రారంభించిన ఏఎస్ఐ..
ఆర్సియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సర్వే ప్రారంభించింది. అంతకుముందు ఇక్కడ దేవాలయం ఉన్నదని నిర్ధారించింది. ముస్లిం సంస్థలు ఎఎస్ఐ నిర్ధారణలను వ్యతిరేకించాయి. బాబ్రీ మసీదు కూల్చివేసినందుకు ఆరుగురు హిందూ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఒక న్యాయస్థానం ఆదేశించింది. అప్పట్లో డిప్యూటీ ప్రధానిగా ఉన్న ఎల్ కే అద్వానీపై ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసులో బీజేపీ సీనియర్ నేత అద్వానీ నిర్దోషిత్వంపై సమీక్షిస్తామని యూపీలోని ఒక న్యాయస్థానం తెలిపింది.
వివాదాస్పద స్థలంపై మిలిటెంట్ల దాడి
ఇస్లామిక్ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై దాడి చేశారు. కట్టడం వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతాగార్డులపై జరిపిన దాడుల్లో ఐదుగురు మిలిటెంట్లు సహా మరో ఆగంతకుడు మరణించారు.
ప్రభుత్వానికి జస్టిస్ లిబర్హన్ కమిషన్ నివేదిక
2009 జూన్లో లిబర్హన్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ నేతల పాత్రపై పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది.
మూడు భాగాలుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు
2010 అక్టోబర్ 31న ఈ వివాదంపై దాఖలైన నాలుగు పిటిషన్లను విచారించిన అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించింది. మూడో వంతు భాగాన్ని హిందూ మహాసభ ఆధ్వర్యంలోని రాంలాలాకు, ఒక భాగం ఇస్లామిక్ వక్ఫ్ బోర్డుకు, మరో భాగం నిర్మోహి అఖారాకు అప్పగించాలని తీర్పు చెప్పింది. కానీ అదే ఏడాది డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అఖిల భారతీయ హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డు.. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
అలహాబాద్ హైకోర్టుపై సుప్రీం స్టే
2011 మేలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 2014లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్రంలో చారిత్రక విజయం సాధించింది.
రాళ్ల సేకరణకు వీహెచ్పీ ఉద్యమం
రామ మందిర నిర్మాణానికి రాళ్లు చేరవేయడానికి జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని 2015 డిసెంబర్లో వీహెచ్ పీ ప్రకటించింది. ఆరు నెలల్లో వివాదాస్పద స్థలానికి రెండు ట్రక్కుల రాళ్లు చేరుకున్నాయి. రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని మహంత్ న్రుత్య గోపాల్ దాస్ ప్రకటించారు. కానీ యూపీలోని నాటి అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ప్రభుత్వం వివాదాస్పద స్థలానికి రాళ్లు చేరవేయడానికి అనుమతించలేదు.
చార్జిషీట్ నమోదుకు సుప్రీం ఆదేశం
1992 డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ తదితరులపై చార్జిషీట్ ఉపసంహరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం.