రామ జన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్కు కరోనా: ప్రధానితో వేదిక పంచుకున్న మహంత్
లక్నో: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ సారథి మహంత్ నృత్యగోపాల్ దాస్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
నృత్యగోపాల్ దాస్తోపాటు వేదికపై ఐదుగురు
అయితే, ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీతోపాటు నృత్యగోపాల్ దాస్ వేదికను పంచుకోవడం గమనార్హం. ఈయనతోపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఆ వేదికను పంచుకున్నారు.
శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడటంతో.. కరోనా పాజటివ్ అని..
ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్యగోపాల్ దాస్ మథురలో ఉన్నారు. అక్కడే ఆయనకు జ్వరం, శ్వాసకోస సమస్యలు ఏర్పడటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 82 ఏళ్ల నృత్యగోపాల్ దాస్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. నృత్యగోపాల్ దాస్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జ్వరం సాధారణంగానే ఉందని, శ్వాసతీసుకోవడంలోనే కొంత ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లెవల్స్ పరీక్షించామని తెలిపారు.
నృత్యగోపాల్ దాస్ ఆరోగ్యం నిలకడగానే.. సీఎం యోగి ఆదేశాలు
కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మథుర జిల్లా మేజిస్ట్రేట్ సర్వంగ్య రామ్ మిశ్రా తెలిపారు. మహరాజ్ నృత్యగోపాల్ దాస్ను మెరుగైన వైద్యం కోసం మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. కాగా, 2003 నుంచి నృత్య గోపాల్ దాస్ రామ జన్మభూమి న్యాస్ కు నాయకత్వం వహిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం కోసం ఈ ట్రస్ట్ ఏర్పడింది. కాగా, భూమిపూజకు ఒక రోజు ముందే పూజారి ప్రదీప్ దాస్తోపాటు 14 మంది పోలీసులకు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.