రామ మందిరంపై సాక్షి సంచలన వ్యాఖ్యలు: ములాయం లేదా మాయావతి కడతారా?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారు.
'రామ మందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో జరుగుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తాం. ఈరోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే తర్వాత రోజు. మా ప్రభుత్వానికి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటాం' అని సాక్షి మహరాజ్ అన్నారు.
నరేంద్ర మోడీ సర్కారు కూడా కూలిపోతుందని శనివారం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ వ్యాఖ్యానించారు. సురేంద్ర జైన్ మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ మెజార్టీ కేవలం దేశాన్ని అభివృద్ధి చేయడం వల్ల వచ్చిందని కాదన్నారు.
కీలక అంశాల(రామ మందిరం)ను పరిష్కరిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో మీరు వెనకడుగు ఎలా వేయగలరు? అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించకపోతే ప్రధాని మోడీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. సురేంద్ర జైన్ వ్యాఖ్యల నేపథ్యంలో రామ మందిరం నిర్మాణంపై సాక్షి మహారాజ్ ఆదివారం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.