ఈ ఏడు రామమందిరం ప్రారంభం: సుబ్రహ్మణ్య స్వామి
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్యణ్య స్వామి చెప్పారు. ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రామమందిర నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యేలా ఈ నెల తొమ్మిదో తేదిన జరిగే జాతీయస్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
విలేకరుల ఓ ప్రశ్నకు సుబ్రహ్మణ్యస్వామి సమాధానమిస్తూ... రాముడికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నిర్మాణం ప్రతిహిందువు ఆకాంక్ష అన్నారు. మందిర నిర్మాణాన్ని ఎన్నికలతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మందిర నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే మందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇందుకు సంబంధించిన కోర్టు తీర్పు ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబరు నాటికల్లా వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాతే ఆలయని ర్మాణం జరుగుతుందని స్వామి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు కోసం వేచి చూస్తామన్నారు. ఉద్యమాల ద్వారా ఆలయ నిర్మాణం జరగదన్నారు.
హిందూ-ముస్లింల అంగీకారంతోనే మొదలౌతుందని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య ఆలయం సమస్యను సామరస్యంగా పరిష్కరించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. పర్యవసానంగా అయోధ్యలో సరయూ నదికి ఇరువైపులా మందిరం, మసీదు నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2017లో జరగాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో ఆలయ నిర్మాణం నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ... శ్రీరాముడికి ఎన్నికలకు లంకె పెట్టవద్దన్నారు. ఒకవేళ ఆలయం అంశం ఆ తర్వాత వస్తే, దానిని కాస్తా తదుపరి లోకసభ ఎన్నికలకు ముడిపెట్టేస్తారన్నారు.