యుపిలో ఓటమి: బిజెపిని హెచ్చిరించిన రామ్ విలాస్ పాశ్వాన్
పాట్నా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు లోకసభ స్థానాలను కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ బిజెపికి హెచ్చరిక చేశారు. ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పాశ్వాన్ - సమాజంలోని కొన్ని వర్గాల్లో బిజెపి తన ప్రతిష్టను కాపాడుకోవాల్సి ఉంటుందని అన్నారు.
బీహార్ ఉప ఎన్నిక ఫలితం పెద్ద ఆశ్చర్యకరమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఫలితాలు దిగ్బ్రాంతికి గురి చేశాయని ఆయన అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాదరణ గల ప్రభుత్వాలను నడుపుతూ కూడా యుపిలో రెండు స్థానాలను బిజెపి కోల్పోయిందని అన్నారు.
మెనారిటీలు, దళితుల విషయాల్లో బిజెపి తన దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. బిజెపిలో లౌకికవాద నాయకులు లేరా అని ఆయన ప్రశ్నించారు. సుశీల్ మోడీ, రామ్ కృపాల్ యాదవ్ వంటి నేతలు ఉన్నారని గుర్తు చేసారు. వారి గొంతును అణచేసి, ఇతరుల గొంతును పెంచారని ఆయన అన్నారు..
ఉప ఎన్నికల సమయంలో బీహార్ బిజెపి చీఫ్ నిత్యానంద రాయ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పాశ్వాన్ ఆ విధంగా అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సామాజిక గణాంకాలు బలంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. దళితులు, బ్రాహ్మణుల, ముస్లింల మద్దతుతో వారికి ఏమీ చేయకుండానే కాంగ్రెసు సుదీర్ఘ కాలం ఆధికారంలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని, రిజర్వేషన్ల వంటి అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని అన్నారు.