రామ మందిర నిర్మాణమే రామరాజ్య స్థాపనకు నాంది .. అయోధ్యలో రాందేవ్ బాబాతో సహా పలువురు స్వామీజీల హర్షం
శ్రీ రామ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. ఎటు చూసినా కాషాయ వర్ణంతో జై శ్రీరామ్ నామ సంకీర్తనతో శోభాయమానంగా కనువిందు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీ లందరూ రామాలయం శంకుస్థాపన వేడుకను తిలకించడానికి అయోధ్యకు చేరుకున్నారు. రామమందిర నిర్మాణ శంకుస్థాపన వేడుకను ప్రత్యక్షంగా చూడడం అద్భుతమైన భావన అని స్వామీజీలు చెబుతున్నారు.
భారతావనికి ప్రతీక: రామ మందిర భూమి పూజ వేళ ఎల్కే అద్వానీ భావోద్వేగ సందేశం
అయోధ్యలో రామాలయ శంకుస్థాపన మహోత్సవంలో స్వామీజీలు
దేశంలోని ప్రముఖ స్వామీజీలు అందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపన మహోత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రామాలయం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు పండుగ జరుపుకుంటున్నారు. ఇక ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించటానికి అయోధ్యకి వెళ్ళిన స్వామీజీలు తమ ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకుంటున్నారు.
దేశంలో రామ రాజ్య స్థాపనకు నాంది : బాబా రాందేవ్
రామమందిర నిర్మాణం వేడుకున్న ప్రత్యక్షంగా వీక్షించడం అద్భుతమని పేర్కొన్న ఆధ్యాత్మిక, యోగా గురువు బాబా రాందేవ్ రామాలయ నిర్మాణ ఘట్టమే దేశంలో రామ రాజ్య స్థాపనకు నాంది అని పేర్కొన్నారు. రామ్ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్య మత, ఆధ్యాత్మిక హాట్స్పాట్గా మారడానికి సిద్ధంగా ఉందని యోగా గురువు స్వామి రామ్దేవ్ అన్నారు. "అయోధ్య మత మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ఆకర్షణగా మారుతుంది" అని రామ్దేవ్ చెప్పారు. అంతేకాదు అయోధ్య నగరం లో పతంజలి యోగ పీఠం ఆధ్వర్యంలో భారీ గురు కులాన్ని కూడా నిర్మించనున్నట్లు గా రాందేవ్ బాబా ప్రకటించారు. ప్రపంచ దేశాలకు చెందిన వారు ఎవరైనా సరే అయోధ్యలో నిర్మించే గురుకులంలో వేదాలను, ఆయుర్వేదాన్ని నేర్చుకోవచ్చు అని రాందేవ్ బాబా ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈరోజు చరిత్రపుటల్లో నిలిచిపోతుంది : స్వామి అవదేశానందగిరి
రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి అయోధ్యకు చేరుకున్న స్వామి అవదేశానందగిరి రామాలయ నిర్మాణంతో ఇప్పుడు యావత్ ప్రపంచం భారతదేశం పైనే దృష్టి పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. శాంతి సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచే విధంగా ఈరోజు చరిత్రపుటల్లో నిలిచిపోతుందని, ఇది ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుంచుకోవలసిన అద్భుతమైన సంఘటన అని ఆయన పేర్కొన్నారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ భావనకు సంకేతం : స్వామి చిదానంద సరస్వతి
స్వామి చిదానంద సరస్వతి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క గొప్పతనం నేడు రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం తో తేటతెల్లమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ భావనకు ఇది సంకేతమని స్వామి చిదానంద సరస్వతి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విభేదాలను తొలగించి, వారిని దగ్గరకు చేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రామమందిర నిర్మాణ శంకుస్థాపన తో మనమంతా వసుదైక కుటుంబం అనే భావన కలుగుతుందని స్వామి చిదానంద సరస్వతి తెలిపారు.
Recommended Video
అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తూ పులకించిపోతున్న స్వామీజీలు
అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుండి చిన్న జీయర్ స్వామీజీ కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో చిన్న జీయర్ స్వామి హర్షం వ్యక్తం చేశారు. అయోధ్యలో చిన్న జీయర్ స్వామీజీ కూడా ఆశ్రమ నిర్మించనున్నట్లు గా సమాచారం. మొత్తానికి దేశంలోని స్వామీజీలంతా అయోధ్యలో జరగనున్న రామమందిర నిర్మాణం నేపథ్యంలో జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు. ఒక అద్భుతమైన ఘట్టాన్ని వీక్షిస్తున్నందుకు పులకించి పోతున్నారు.