అయోధ్యలో రాముడు మాత్రమే ఉండాలి, రెండేళ్లలో రామ మందిరం: ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ!
ఉడిపి/ బెంగళూరు: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2019 నాటికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభిస్తుందని ఉడిపి పేజావర పిఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికవేత్తల నేతృత్వంలో రామ మందిర నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభిస్తామని శ్రీ విశ్వేశతీర్థ స్వామి స్పష్టం చేశారు.
అయోధ్యలో రామ మందిరం మాత్రమే ఉండాలని, అక్కడ మరే నిర్మాణానికీ తాము అంగీకరించబోమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు ధ్వంసమై పాతికేళ్లకు పైగా అవుతోందని మోహన్ భగవత్ గుర్తు చేశారు.
వేచి చూసే ఓపిక లేదు
రామ మందిర నిర్మాణం కోసం మనం ఇంకా వేచి చూడాల్సి వస్తోందని మోహన్ భగవత్ విచారం వ్యక్తం చేశారు. రామ మందిరం నిర్మాణం కోసం మనం ఇంకా వేచి చాడాల్సిన అవసరం లేదని, ఆ ఓపిక మనకు లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
రాముడు మాత్రమే ఉండాలి !
సంఘ్ పరివార్ సేవకులు రామ మందిర నిర్మాణం ఎప్పుడని ప్రశ్నిస్తున్నారని, రెండేళ్లలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని, అక్కడ రామ మందిరం, రాముడు మాత్రమే ఉండాలని, మరే కట్టడాలు ఉండేందుకు వీల్లేదని మోహన్ భగవత్ కుండలు బద్దలుకొట్టి చెప్పారు.
మత మార్పిడులపై జాగ్రత్త !
వచ్చే వారంలో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని మోహన్ భగవత్ ధీమా వ్యక్తం చేశారు. మత మార్పిడులపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, లవ్ జీహాద్ ను అడ్డుకుని వారికి తగిన గుణపాఠం చెప్పాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
దేశం మొత్తం ఎదురు చూస్తోంది
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ దేశం మొత్తం ఎదురు చూస్తోందని విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. రామ మందిరం నిర్మించే వరకూ తాము నిద్రపోమని ప్రవీణ్ భాయ్ తొగాడియా చెప్పారు.
2 వేల మంది పీఠాధిపతులు
ఉడిపి ధర్మ సంసద్ 2017 సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా, ధర్మస్థలం ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్ష్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, వివిధ మఠాలకు చెందిన దాదాపు 2 వేల మంది మఠాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.