తమిళనాడు సీఎంకు జడ్ ప్లస్ సెక్యూరిటీ, ప్రాణహాని లేదుకదా, మరెందుకు, పీఎంకే రామదాస్ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎలాంటి ప్రాణహాని లేదని, ఆయనకు ఇంత వరకు ఎవ్వరి నుంచి బెదిరింపులు కూడా రాలేదని,
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎలాంటి ప్రాణహాని లేదని, ఆయనకు ఇంత వరకు ఎవ్వరి నుంచి బెదిరింపులు కూడా రాలేదని, అలాంటి సమయంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం జడ్ ఫ్లస్ (Z Plus)భద్రత ఎలా కల్పిస్తుందని పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్ ప్రశ్నించారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన రామదాస్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి జడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన అవసరం ఏమి వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు ఇంత వరకు ఎడప్పాడి పళనిసామి సైతం తనకు జడ్ ప్లస్ భద్రత కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదని రామదాస్ గుర్తు చేశారు.
డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కు జడ్ కవర్ సెక్యూరిటీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించారని రామదాస్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవసరం లేకున్నా నాయకులకు జడ్ ప్లస్ కేటగిరి కేటాయించి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి జడ్ ప్లస్ భద్రతను ఉప సంహరించాలని రామదాస్ డిమాండ్ చేశారు.