ప్రధాని మోడీ మాట, చైనా గూడ్స్ రెండు ఒక్కటే, గ్యారెంటీ లేదు, వారెంటీ లేదు, రామలింగా రెడ్డి ఫైర్!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ మీద కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి విరుచుకుపడ్డారు. అపద్దాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ దిట్ట అని, ఆ విషయంలో ఆయనకు నోబుల్ బహుమతి ఇవ్వాలని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మాటకు చైనా గూడ్స్ కు ఎక్కడా విలువలేదని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు. శనివారం బెంగళూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడిన హోం మంత్రి రామలింగా రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు.
బెంగళూరు క్రైం సిటి
ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు క్రైం సిటి అని, నలపాడ్ గ్యాంగ్ దాడులు చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్ సీఆర్ బీ నివేదికలు చెబుతున్నాయని హోం మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేలు రేప్ చేస్తున్నారు
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే బాలిక మీద అత్యాచారం చేసిన విషయం మీకు కనపడలేదా అని ప్రధాని మోడీని హోం మంత్రి రామలింగా రెడ్డి ప్రశ్నించారు. అనేక మంది బీజేపీ ఎంపీల మీద మహిళలపై దౌర్జన్యాలు చేశారని కేసులు నమోదు అయ్యాయని రామలింగా రెడ్డి ఆరోపించారు.
ఎక్కడ అవినీతి
కర్ణాటక ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడిన రామలింగా రెడ్డి గుజరాత్ కు మూడు సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ లోకాయుక్తను ఎందుకు నియమించలేదని, మీ అవినీతి బయటపడుతుందని నియమించలేదని ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు.
పెట్రోల్, గ్యాస్ ధరలు
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నిసార్లు పెట్రోల్, డీసెల్, గ్యాస్ ధరలు పెరిగాయని బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పాలని హోం మంత్రి రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు.
మోడీ మాట చైన్ గూడ్స్
ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు, చైనా గూడ్స్ కు తేడా లేదని హోం మంత్రి రామలింగా రెడ్డి ఎద్దేవ చేశారు. చైనా గూడ్స్ ఒక్క సారి తీసుకున్న తరువాత గ్యారెంటీ ఉండదని, వారెంటీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అంతేనని రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు.