పారిశ్రామికవేత్తల అనుమతితోనే ప్రధాని మోడీ పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆరాష్ట్రం బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు తమ ఖాతాల్లోకి వేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ పేద రాష్ట్రం కాదన్న రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో నివసిస్తున్న ప్రజలు పేదవారని చెప్పారు.
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారు
ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అటు మోడీ ఇటు సీఎం రమణ్సింగ్లు కలిసి దోచేస్తున్నారని తీవ్ర విమర్శలు రాహుల్ గుప్పించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్లో వచ్చిందని ఆయన్ను వెంటనే జైలుకు పంపిచారన్న రాహుల్, సీఎం రమణ్ సింగ్ తనయుడి పేరు కూడా పనామా పేపర్లలో వచ్చిందని అయితే అతని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం రమణ్ సింగ్లు ఛత్తీస్గఢ్ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారని కానీ ఇప్పటికీ 60వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 13వేల లెక్చరర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్న రాహుల్.... 3వేల ఆదివాసిల పాఠశాలను మూసివేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీని చేపడుతామని హామీ ఇచ్చారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చారిత్రాత్మక తప్పిదాలు
గిరిజనుల హక్కు చట్టం ఉన్నది ఆదివాసీల భూములను పరిరక్షించేందుకని కానీ బీజేపీ మాత్రం ఆ విధానాలకు తిలోదకాలు ఇచ్చేసిందని ధ్వజమెత్తారు. ఇక పెద్ద నోట్ల రద్దుతో దేశప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో జీఎస్టీతో కూడా అంతే ఇబ్బంది పడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రెండు నిర్ణయాలు చారిత్రాత్మక తప్పిదాలని రాహుల్ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా బడా వ్యక్తులు తమ దగ్గరున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. గురువారంతో పెద్ద నోట్లు రద్దయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు తప్ప కోటీశ్వరులైన విజయ్ మాల్యా లలిత్ మోడీ లాంటి వ్యక్తులు కాదని అన్నారు.
కర్నాటక పంజాబ్లా రైతులకు రుణమాఫీ చేస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. మోడీ జీఎస్టీ ప్రకటిస్తూ దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.. కానీ మరుసటి రోజే ఐదు రకాల పన్ను విధానాలు కనిపించాయని చెప్పారు. తను మోడీలా అబద్ధాలు చెప్పనని చెప్పిన రాహుల్ గాంధీ పంజాబ్, కర్నాటకలో రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించానని ఇప్పుడు చేసి చూపించామని చెప్పారు రాహుల్ గాంధీ.
అనిల్ అంబానీకి మేలు చేయడం కోసమే రాఫెల్ ఒప్పందం
ఇక రాఫెల్ అంశం గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. కేవలం అనిల్ అంబానీకి మేలు చేయడం కోసమే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంను హాల్కు కాకుండా అనిల్ అంబానీ కంపెనీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు . ఇప్పటి వరకు అంబానీ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా తయారు చేయలేదని అలాంటప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల అతని కంపెనీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా మన్కీబాత్ చేస్తారని... కాంగ్రెస్కు ఆ తరహా మన్కీ బాత్ చేయడం ఇష్టం లేదని కేవలం ప్రజల మనసులోని మాటనే వింటుందని.. ఆ ప్రకారంగా నడుచుకుంటుందని చెప్పారు.