నేను కేంద్రమంత్రిని, పెట్రోల్ ధరలు పెరిగితే నాకు ఇబ్బంది లేదు: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పెట్రోల్ ధరల పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ పెట్రోల్ ధరల పెరుగుదలపై రాందాస్ అథవాలే మాట్లాడుతూ... పెట్రో ధరలు పెరగడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదన్నారు. తాను ఒక కేంద్రమంత్రిని అని, తన మంత్రి పదవి పోతే మాత్రం నేను బాధపడాల్సి వస్తుందని చెప్పారు.
ధరల పెరుగుదలతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, ధరలను తగ్గించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఆ కుటుంబానికి, బీజేపీలో మాత్రం అలాకాదు: మోడీ
తాను మంత్రిని కాబట్టి తనకు ఇబ్బంది లేదన్న వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో అతను మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా కామన్ మ్యాన్నే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఆలోచించి, పెట్రోపై విధిస్తున్న పన్నులను తగ్గించాలని ఆయన సూచించారు. 'రాష్ట్రాలను పన్నుల భారాన్ని తగ్గించి, పెట్రో ధరలు తగ్గేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ధరలను తగ్గించాలని సీరియస్గా పనిచేస్తోంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, పెట్రో ధరల పెరుగుదలపై ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ధరల నియంత్రణ తమ పరిధిలో ఉండదని, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు డాలరు విలువ పెరగడం వంటివే పెట్రో ధరలకు కారణమవుతున్నాయన్నారు.