"ఇంటర్ క్యాస్ట్ ప్రేమలే బలిపెడుతున్నాయి..! ఆయుధాలివ్వాల్సిందే"
ముంబై : దేశంలో జరుగుతోన్న పరువు హత్యలన్నీ కులాలతో ముడిపడి ఉన్నవే. పేద ధనిక తేడాల కన్నా, దేశంలో కులాల పట్టింపే ఎక్కువ మంది ప్రేమికుల హత్యలకు కారణమవుతోంది. వివాహాల చుట్టూ పాతుకుపోయిన కుల వ్యవస్థ, కులాంతర వివాహాలు చేసుకునేవారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.
ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ల విషయంలో దళిత వర్గాలపై దాడులు పెరుగుతోండడం ఆందోళన కలిగించే విషయం. ఇదే విషయంపై స్పందించిన కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ఈ పరంపరకు అడ్డుకట్ట వేయడానికి దళితుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు.
ఇటీవలే కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ దాస్ కులాంతర వివాహాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితులపై జరుగుతోన్న దాడుల్లో కులాంతర వివాహాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయని వెల్లడించారు. కులాంతర వివాహాలకు సంబంధించి దళితులపై దాడులు ఆగాలంటే ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు అనుమతించాలని సూచించారు.
గతంలో చాలాసార్లు తాను ఈ డిమాండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు రామ్ దాస్. మహారాష్ట్ర దళిత నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చీఫ్ కు వ్యవహరిస్తున్న రామ్ దాస్, ప్రస్తుతం న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నందు వల్ల, దళితులకు ఆయుధాలు అనుమతించే విషయమై ఆలోచన చేస్తున్నట్టుగా తెలిపారు. దళితులు కులాంతర వివాహాలు చేసుకోవడం అగ్ర కులాలకు నచ్చడం లేదని, ఈ కారణంగానే దళితులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
చివరగా, 'ఆత్మరక్షణ కోసం దళితులు ఆయుధాలు ధరించడమనేది వారి హక్కు. దళితులు చట్టబద్దంగా ఆయుధాలను ధరించాలని కోరుకుంటున్నాను. కానీ ఈ విషయం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది కాబట్టి నిర్ణయం వారి మీదే ఆధారపడి ఉంటందని' వ్యాఖ్యానించారు రామ్ దాస్. గతవారం హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రామ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం.