‘డోంట్ వర్రీ!మహారాష్ట్రలో మన ప్రభుత్వమే వస్తుంది: అమిత్ షా’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలోనే శివసేన పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే.
అంతా సవ్యమే..
మహారాష్ట్ర రాజకీయాలపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినప్పుడు ఆయన.. అంతా సవ్యంగానే సాగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్లు ఆదివారం మీడియాకు తెలిపారు.
డోంట్ వర్రీ అంటూ అమిత్ షా..
‘మీరు మధ్యవర్తిత్వం వహిస్తే ఏమైనా సానుకూల అవకాశం ఉంటుందేమో' అని తాను అమిత్ షాతో మహారాష్ట్ర పరిస్థితులపై ప్రస్తావించానని రామ్ దాస్ తెలిపారు. ‘డోంట్ వర్రీ.. అంతా సవ్యంగానే సాగుతుంది. త్వరలోనే మహారాష్ట్రలో శివసేన పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం' అని అమిత్ షా వ్యాఖ్యానించారని అథవాలే తెలిపారు.
శివసేనకు దూరమైన బీజేపీ..
ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని శివసేన పార్టీ పట్టుబడట్టడంతో ఆ పార్టీకి బీజేపీ దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన..
త్వరలోనే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు గవర్నర్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలో అమిత్ షా తమ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ ధీమా వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయంగా మారింది.