కరోనాకు పతంజలి మందు విడుదల చేసిన రాం దేవ్ బాబా.. మూడు రోజుల్లోనే వ్యాధి నయమట..!
ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలకు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వివిధ కంపెనీలు కరోనా మెడిసిన్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆయుర్వేదంలో కూడా కరోనాకు మందు ఉందని, ఆయుర్వేదిక్ మందుతో కరోనాను తగ్గించవచ్చని పేర్కొన్న రాందేవ్ బాబా నేడు మార్కెట్లోకి పతంజలి సంస్థ తయారుచేసిన కరోనా మందులు విడుదల చేశారు. ఇక ఈ మందులు తయారు చేయడానికి కృషిచేసిన శాస్త్రవేత్తలకు,నిపుణులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
"కరోలిన్" పేరుతో మార్కెట్లో ఆయుర్వేద మందుల కిట్ విడుదల చేసిన రాందేవ్ బాబా
"కరోలిన్" పేరుతో మార్కెట్లో ఆయుర్వేద మందుల కిట్ విడుదల చేసిన రాందేవ్ బాబా హరిద్వార్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మందుతో కరోనాను నయం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా మారుతున్న సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని పేర్కొన్న రాందేవ్ బాబా క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చామని కరోనిల్ మందు తయారీకి పడిన శ్రమను వివరించారు.
కరోనాను తగ్గించే దివ్య ఔషధం... 100% రిజల్ట్
మూడు రోజుల్లోనే ఈ మందు ప్రభావంతో చాలామంది కోలుకున్నారని పేర్కొన్నారు రాందేవ్ బాబా. ఇక అశ్వగంధ,తులసి, గిలోయ్ తో కలిపి కరోనిల్ ను చికిత్సలో వినియోగించి నప్పుడు 100% రిజల్ట్ ఉంటుందని రాందేవ్ బాబా పేర్కొన్నారు. పతంజలి రీసెర్చి ఇనిస్టిట్యూట్, జైపూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా ఈ మందు తయారీ కి రీసెర్చ్ చేసినట్లుగా పేర్కొన్నారు.ఇక మందు ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుందో క్షుణ్ణంగా పరిశీలించామని ఒక్క మరణం కూడా సంభవించలేదని నూటికి నూరు శాతం రిజల్ట్స్ ఉందని పేర్కొన్నారు .
కరోనిల్ కిట్ మార్కెట్లో 545 రూపాయలకి లభిస్తుందని పతంజలి ఎండీ బాలకృష్ణ
ఇక కరోనా చికిత్స కు ఆయుర్వేద నివారణ అని పతంజలి మార్కెట్లోకి విడుదల చేసిన కరోనిల్ మరియు శ్వాసరి బాధిత రోగులపై క్లినికల్ ట్రయల్స్ సమయంలో 100% అనుకూలమైన ఫలితాలను ఇచ్చిందని పతంజలి ఆయుర్వేద ఎండి ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు . ఈ ఆయుర్వేద మెడిసిన్ మూడు నుండి 14 రోజుల్లో కరోనా రోగులకు నయం చేయగలదని తెలిపారు. ఇక ఈ కరోనిల్ కిట్ మార్కెట్లో 545 రూపాయలకి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో నెల రోజుల పాటు వాడటానికి కోర్సు ఉంటుందని తెలిపారు.
Recommended Video
ఇమ్యూనిటీ బూస్టర్ కాదు .. వైరస్ ను తగ్గించే మందు మాత్రమే
సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలతో కరోనా నివారణ కోసం ఆయుర్వేదిక్ మందును అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇక అంతే కాదు ఈ మందును ప్రజలకు చేరువ చేయడానికి ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, దానిద్వారా ఈ మందును బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కాదని, కేవలం కరోనా వైరస్ ను తగ్గించే మందు మాత్రమేనని పేర్కొన్నారు. కరోనా కు కారణం అయ్యే సార్స్ కోవి 2 వైరస్ ను కరోనిల్ తగ్గిస్తుందని తెలిపారు.