ఢిల్లీ సమరం: రోడ్ షోలు, బహిరంగ సభలు... ఒకరిపై మరొకరు విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
ఢిల్లీలోని కొన్ని నియోజక వర్గాల్లో ఆమె బుధవారం రోడ్ షోలు నిర్వహించారు. ఓటర్ల సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. యోగా గురువు రాందేవ్ బాబా బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను కోరారు.
ఇక ఢిల్లీలోని ఇంద్రలోక్లో కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జనం పెద్ద ఎత్తు హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఆరోపణలు చేశారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మునుగుతున్న నావ అని.. ఆ పార్టీలో కిరణ్బేదీ చేరడంవల్ల ఆమె భవిష్యత్ కనుమరుగు అవుతుందని ఆయన విమర్శించారు.