ఎర్రచందనం కొనుగోలు: రాందేవ్ బాబా పతంజలి యోగాపీఠమే టాప్..!
హైదరాబాద్: శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగలను భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారుల్లో ప్రముఖ యోగా గురువు, హర్యానా బ్రాండ్ అంబాసిడర్ రాందేవ్ బాబా ప్రధమ స్ధానంలో ఉన్నారు. రాందేవ్ బాబా కొనుగోలు చేసిన ఎర్రచందనం దుంగలను ఆయన ఆధ్వర్యంలోని పతంజలి యోగాపీఠం ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తున్నారంట.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం దుంగల విక్రయం కోసం జరిపిన వేలం పాటలో రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగాపీఠం కూడా పాల్గొంది. ఈ వేలం పాటలో రూ. 207 కోట్లు వెచ్చించి, 706 టన్నుల ఎర్రచందనం దుంగలను బాబా దక్కించుకున్నారు.
ఎర్రచందనం దుంగలను మూడు గ్రేడ్లుగా విభజిస్తారు. పతంజలి యోగాపీఠం కొనుగోలు చేసిన ఎర్రచందనం దుంగలు గ్రేడ్ సీకి చెందినవి. పతంజలి యోగాపీఠం ఒక్కో టన్నుకి రూ. 29 లక్షలు చెల్లించి ఈ ఎర్రచందనం దుంగలను స్వాధీనం కొనుగోలు చేశారు.
ఆయుర్వేద మందుల తయారీలో ఎర్రచందనం దుంగలను వినియోగిస్తున్నామంటున్న ఆ సంస్ధ ప్రతినిధులు, అందుకే పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదే గ్రేడ్ ఎ ఎర్రచందనం దుంగలు టన్ను రూ. 1.75 కోట్లు ఉంటుంది. గ్రేడ్ బీ టన్ను రూ. 1.5 కోట్లుగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ ఎర్రచందనం దుంగలను చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మూలికా కామోద్దీపనల్లో వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ 8న 300 టన్నుల ఎర్రచందనం దుంగలను చైనాకు అమ్మడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎర్రచందనం దుంగలను అమ్మకాలను ఈ బిడ్డింగ్ ద్వారా నిర్వహిస్తోంది. 3,500 టన్నుల ఎర్రచందనాన్ని రెండో దశలో వేలం పాటగా మే నెలలో వేయనున్నట్లు సమాచారం.