షాక్: నాణ్యత పరీక్షల్లో 'పతంజలి' ఫెయిల్
బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి సంస్థ ఉత్పత్తులు సహా దాదాపు 40 శాతం వరకు ఆయుర్వేద ఉత్పత్తులు నాణ్యత పరీక్షలలో విఫలమైనట్టు సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది.
న్యూఢిల్లీ:బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి సంస్థ ఉత్పత్తులు సహా దాదాపు 40 శాతం వరకు ఆయుర్వేద ఉత్పత్తులు నాణ్యత పరీక్షలలో విఫలమైనట్టు సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది.
హరిద్వార్ కు చెందిన ఆయుర్వేద, యునానీ కార్యాలయం ఈ పరీక్షలు చేసింది. 2013 నుండి 2016 వరకు మొత్తం 82 శాంపిళ్ళు సేకరించి పరీక్షించగా వాటిలో 32 నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి.
పతంజలి సంస్థ దివ్య ఆమ్లా జ్యూస్, శివలింగ బీజ్ లాంటి ఉత్పత్తులలో కూడ నాణ్యత తగినంతగా లేదని తేలింది. పశ్చిమబెంగాల్ లోని పబ్లిక్ హెల్త్ ల్యాబోరేటరీ నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో కూడ ఆమ్మా జ్యూస్ విఫలం కావడంతో గత నెలలో సైనిక దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్ మెంట్ నుండి దాన్ని ఉపసంహరించుకొన్నారు.
నీళ్ళలో కిగే ఉన్న క్షారతను పరీక్షించడానికి చూసే పీహెచ్ విలువ, ఆమ్లా జ్యూస్ లో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ల్యాబ్ నివేదిక తెలిపింది.7 కంటే తక్కువ పీహెచ్ విలువ ఉన్న ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శివలింగి బీజ్ 31.68 శాతం వేరే పదార్ధాలు ఉన్నాయన్నారు.
అయితే ఈ ఆరోపణలను పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ఖండించారు. శివలింగి బీజం అనేది సహజమైన విత్తనమని, అందులో కల్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పతంజలి సంస్థ పేరు ప్రతిష్టలను మంటగలిపేందుకు ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు.
ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ ఆయుర్వేద ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ప్రధానంగా హరిద్వార్ , రిషికేశ్ లలో వెయ్యిమందికి పైగా ఆయుర్వేద డీలర్లు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులున్నారు.