బాలీవుడ్ పై రాందేవ్ సంచలన కామెంట్స్, చైనా వస్తువులు ఎందుకు కొనవద్దంటే!
న్యూఢిల్లీ : చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డ బాబా రాందేవ్.. బాలీవుడ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో ఆర్జించిన సొమ్ము ద్వారా పాక్ సాయం చేస్తూ వస్తోన్న చైనా పోకడలను నిలువరించాలంటే.. చైనా వస్తువుల కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దంటూ బాబా రాందేవ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లోను దీనిపై జోరుగా ప్రచారం జరుగుతుండడంతో.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూ ద్వారా దీనిపై వివరణ ఇచ్చారు రాందేవ్.
చైనా వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండడం ద్వారా.. ఆ దేశ పాలకులపై సామాజికంగా ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి చైనా వస్తువులను వాడవద్దని పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. ఇదే సమయంలో భారత్ లో పాక్ నటీనటులు నటించిన సినిమాలపై నిషేధం కొనసాగుతుండడంతో.. కరణ్ జోహార్ లాంటి వ్యక్తులు కేంద్రమంత్రి రాజ్ నాథ్ తో సైతం చర్చలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని రాందేవ్ వద్ద ప్రస్తావించగా.. 'కళాకారులు తీవ్ర వాదులు కాదు, అయితే హిందీ సినిమాల్లో నటిస్తోన్న వారికి మనస్సాక్షి అనేదే లేదు. వాళ్ల ఆరాటమంతా ఎంతసేపు సినిమాలు, డబ్బు సంపాదన, బిర్యానీ తినడం గురించేనని, యూరీ ఉగ్రదాడిలో భారతీయులు చనిపోతే వారెందుకు ఖండించలేదని' రాందేవ్ మీడియా ముఖంగా ప్రశ్నించారు.
ఇక పాక్ లో పతంజలి నిర్వహణపై ప్రశ్న లేవనెత్తగా.. ' నేను పాకిస్తానీ నటీనటుల్లా కాదు. పాక్ లో సంపాదించిన డబ్బును భారత్ కు తీసుకురావాలన్న ఆశ లేదు. అక్కడ ఆర్జించింన సొమ్మును పాక్ ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడుతున్నా' అంటూ వివరించారు. పతంజలిలో తనకు సింగిల్ షేర్ కూడా లేదని నిరాడంబరంగా జీవితం గడుపుతున్నాని చెప్పుకొచ్చారు.
ఎన్టీయే పాలనపై మీ అభిప్రాయమేంటని ప్రశ్నించగా.. యోగికి సంతోషం దు:ఖం రెండూ ఉండవంటూనే మోడీ విజయవంతమైన ప్రధాని అంటూ రాందేవ్ బాబా సమాధానం చెప్పడం గమనార్హం. చివరగా, రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తెలిపిన రాందేవ్.. పదవుల కోసం తాను ఆశించడం లేదని పేర్కొన్నారు.