సన్యాసిని.. నాకొద్దు: 'పద్మ'పై రాందేవ్, నాకూ వద్దు: శ్రీశ్రీ రవిశంకర్
న్యూఢిల్లీ: తమకు పద్మ పురస్కారాలు వద్దని యోగా గురువు బాబా రామ్దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తాము పద్మ అవార్డులకు దూరమని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తుంది.
అయితే, తనకు అవార్డు ప్రకటించినట్లు హోంమంత్రి రాజ్నాథ్ ఫోన్ చేసి చెప్పగా, సున్నితంగా తిరస్కరించినట్లు రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తనకు పద్మవిభూషణ్ ప్రదానం చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిందన్న మీడియా కథనాలపై రామ్దేవ్ స్పందించారు. తనకు పురస్కారాలు, అవార్డులు ఏవీ వద్దని రాజ్నాథ్సింగ్కు నేరుగా లేఖ రాశారు.
పురస్కారాల పరిశీలనలో తన పేరు ఉందని తెలిసిందని, తాను సన్యాసిని అని, తన విధి ప్రకారం... ఎటువంటి అంచనాలు, కోరికలు లేకుండా సన్యాస ధర్మాలను నిర్వర్తిస్తానని రాందేవ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పురస్కారాన్ని తనకు బదులు అర్హులైన మరొకరికి ఇవ్వాలని కోరారు.
రవిశంకర్ ట్విట్టర్లో పద్మ పురస్కారంపై స్పందించారు. తన పేరు పరిశీలనకు వచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ తనబదులు అర్హులైన ఇతరులకు ఇస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, బాబా రాందేవ్, రవిశంకర్, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేర్లు ఎంపికైనట్లు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.