తృటిలో ప్రమాదం తప్పడం అంటే ఇదే: సముద్రంలో పడితే 12మంది ప్రాణాలు?
చెన్నై: సాధారణంగా ఏదైనా ప్రమాదం తప్పితే.. తృటిలో పెను ప్రమాదం తప్పింది అని అంటూ ఉంటాం. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఈ ఘటనను గమనించినట్లయితే ఈ వ్యాఖ్యం దీనికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే.. సముద్రంపై నిర్మించిన వంతెనపై ప్రయాణిస్తున్న ఓ వ్యాను అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. మినీ బస్సు(వ్యాన్) కొంత భాగం వంతెన నుంచి బయటకొచ్చి గాలిలో తేలింది.
ఒక వేళ ఆ బస్సు పూర్తిగా వంతెన పైనుంచి పడిపోతే.. బస్సులోని ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడేవారు కాదు. అలా జరగకపోవడంతో అదృష్టవశాత్తు 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విరుదునగర్ జిల్లా కల్లూరణికి చెందిన 12 మంది పర్యటన నిమిత్తం ఓ వ్యానులో రామేశ్వరం బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున వ్యాను సముద్రంపై నిర్మించిన పాంబన్ వంతెనపైకి చేరుకుంది. అప్పుడే జల్లులు కురుస్తున్నాయి. బస్సును నడుపుతున్న డ్రైవరు అళగేశ్వరన్ (32) నుంచి ఒక్కసారిగా అదుపుతప్పడంతో వ్యాను వంతెనపై ఎడమవైపునున్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది.
ఆ వెంటనే, అప్రమత్తమైన డ్రైవరు వాహనాన్ని కుడివైపునకు మళ్లించడంతో అక్కడి రక్షణ గోడను బలంగా తాకింది. సమయస్ఫూర్తితో డ్రైవరు బ్రేకులు వేసి వ్యానును నిలిపివేశారు. అప్పటికే రక్షణగోడ ధ్వంసమై ముందు చక్రాలు వంతెన నుంచి బయటకు వెళ్లాయి. పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనలతో పెద్దగా కేకలు వేశారు. తర్వాత తేరుకుని బయటపడేందుకు ప్రయత్నించారు.
వ్యాను తలుపులు కొంతమేరకు వంతెన బయటకు ఉండటంతో ఒక్కొక్కరిగా జాగ్రత్తగా వంతెనపై దిగారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హైవే పెట్రోల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాంబన్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రైవర్ అళగేశ్వరన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ ప్రాణాలను కాపాడారని పర్యాటకులు అతడ్ని మెచ్చుకున్నారు.