ఉప ఎన్నికల ఫలితాలు: జింద్లో బీజేపీ విజయం, రామ్ఘర్లో కాంగ్రెస్ గెలుపు
న్యూఢిల్లీ: రాజస్తాన్లోని జింద్, హర్యానాలోని రామ్ఘర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు చెరో సీటును పంచుకున్నాయి. రామ్ఘర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షఫియా ఖాన్ 12వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. జింద్లో బీజేపీ అభ్యర్థి కృష్ణన్ మిద్దా కూడా 12వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు.
జింద్, రామ్ఘర్లలో మూడు రోజుల క్రితం ఉప ఎన్నికలు జరిగాయి. గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు గాను కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ రాకపోవడంతో బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు రామ్ఘర్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో మేజిక్ ఫిగర్కు మరో అడుగు దూరంలోఉంది. రామ్ఘర్లో 78.9 శాతం పోలింగ్ నమోదయింది.
ఇక, జింద్లో ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్కు, బీజేపీకి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గెలుపు ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపేదే. జింద్లో 70 శాతం పోలింగ్ నమోదయింది.
జింద్ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొని ఉంటుందని భావించారు. అధికారంలో ఉన్న బీజేపీ, సిట్టింగ్ స్థానమైన ఐఎన్ఎల్డీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఏర్పడిన జేజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. లోకసభ ఎన్నికకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నికను స్థానికంగా సెమీ ఫైనల్గా భావించారు.
జింద్ నియోజకవర్గంలో 1.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జాట్ల ఓట్లు ఎక్కువ. 45వేలకు పైగా వారి ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత బ్రాహ్మణులు, ట్రేడర్ కమ్యూనిటీ, పంజాబీల ఓట్లు పదివేల నుంచి పదిహేను వేల మధ్యన ఉన్నాయి. ఎస్టీ, ఎస్సీల ఓట్లు ఎక్కువే. 1972 నుంచి ఇక్కడ జాట్ యేతర అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతుండటం గమనార్హం. అయితే ఈసారి బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలు జాట్ అభ్యర్థిని బరిలో దింపాయి. ఇక్కడి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొడుకును బరిలోకి దింపింది.