ఈ దూకుడెందుకు?.. ఢిల్లీ పోలీసులపై హెచ్చార్సీ ఫైర్
ఢిల్లీలోని రాంజాస్ కళాశాలలో గత నెల 22వ తేదీన జరిగిన ఘర్షణలో పోలీసుల అత్యుత్సాహం, దూకుడుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాంజాస్ కళాశాలలో గత నెల 22వ తేదీన జరిగిన ఘర్షణలో పోలీసుల అత్యుత్సాహం, దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) .. ఈ ఘటనపై నాలుగు వారాల్లో సవివరమైన నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు మంగళవారం నోటీసు జారీచేసింది.
ఈ ఘటన కవరేజీకి వెళ్లిన కొందరు జర్నలిస్టులు తమను పోలీసులు పిడిగుద్దులు గుద్దారని, నెట్టివేశారని తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
రిజిజుపై జావెద్ అక్తర్ మండిపాటు
ఢిల్లీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ మనస్సును లెఫ్టిస్టులు కలుషితం చేస్తున్నారన్న కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ట్వీట్పై ఆయన పేరెత్తకుండానే బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అఖ్తర్ మండిపడ్డారు. ఆమెను ఎవరో ప్రభావితం చేస్తున్నారని తాను భావించడం లేదని జావెద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. తననెవరూ కలుషితం చేయడం లేదని గురు మెహర్ మరో ఫొటో పోస్ట్ చేశారు.
అరెస్ట్కు కేజ్రీ డిమాండ్
ఢిల్లీ వర్సిటీలో హింసకు కారణమైన ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కోరారు. తగు చర్యలు తీసుకుంటామని అనిల్ బైజాల్ హామీనిచ్చారని కేజ్రీవాల్ తర్వాత మీడియాకు చెప్పారు.
భారతీయత మా జాతీయవాదం
ఢిల్లీ వర్సిటీ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని, తనకు భారతీయత జాతీయ వాదం అవుతుందే కానీ హిందుత్వ కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అంతకుముందు ఢిల్లీ వర్సిటీ నార్త్గేట్ వద్దకు సీపీఐ నేత డీ రాజా, జేడీయూ ఎంపీ కేసీ త్యాగితో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు.
భగత్ సింగ్ మాకు ఆదర్శం: యోగేంద్ర
భగత్ సింగ్ తమకు ఆదర్శమని స్వరాజ్ ఇండియా ప్రతినిధి యోగేంద్ర యాదవ్ అన్నారు. జాతీయోద్యమంలో ఏనాడు తమ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేయని వారా? తమకు జాతీయతపై సుద్దులు చెప్పేదని ప్రశ్నించారు.
కాగడాల ప్రదర్శన
ఏబీవీపీ, ఏఐఎస్ఏ గూండాగిరిని సహించబోమని ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఢిల్లీ వర్సిటీ నార్త్గేట్ వద్ద నుంచి రాంజాస్ కళాశాల వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తమ వర్సిటీని రక్షించుకునేందుకు శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తు న్నామని ఎన్ఎస్యూఐ నేతలు తెలిపారు. కార్యక్ర మంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు.