పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే, ఎపికి ప్రత్యేక హోదా: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కె. రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. సోమవారం ఉదయం లోక్సభలో ఆ విషయంపై మాట్లాడారు. విభజన చట్టంలో చెప్పిన విధంగా 15 సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు.
ప్రత్యేక హోదా విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి విన్నవించారన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని అంటూ ఏపీకి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని ఎంపీ రమ్మోహన్నాయుడు కేంద్రాన్ని కోరారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన నిర్వహించారు. సహారా కుంభకోణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. సహారా కుంభకోణం విచారణలో ఒక డైరీ దొరికిందని, అందులో అమిత్ షా పేరు ఉందని ఎంపీలు ఆరోపించారు.
సహారా స్కాంలో అమిత్షా ప్రమేయంపై దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.ఆదివారం కోల్కత్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా శారదా చిట్స్ స్కామ్లోనూ, బర్దన్ పేలుళ్ల ఘటనలోనూ తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని ఆయన ఆరోపించిన విషయం విధితమే. దానికి జవాబుగా అన్నట్లు టీఎంసీ ఎంపీలు సోమవారం అమిత్షాను లక్ష్యం చేసుకున్నారు.