ఢిల్లీ ఓటమి: అమిత్ షాపై బీజేపీ నేతల గుర్రు, మోడీ వల్ల కూడా..
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పైన భారతీయ జనతా పార్టీ కేడర్ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫలితాలపై శనివారం ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ ఆధ్వర్వంలో ఇరవై ప్రాంతీయ కార్యాలయాలు, కొందరు జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కిరణ్ బేడీ హాజరుకాలేదు. ఈ సందర్భంగా నాయకులు తమ అక్కసునంతా బయటపెట్టారు. కిరణ్ బేడీని కేవలం మూడు వారాల ముందు పార్టీలో చేర్చుకుని, కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమపై రుద్దారని కుండబద్దలు కొట్టారు.
చేరిన వెంటనే ఆమెను పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి 36 కారణాలు ఉన్నాయని వారు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన చర్చల్లో స్థానిక నేతలను గానీ ఎంతో కాలంగా పార్టీ కోసం కృషి చేస్తున్న సీనియర్లను గానీ విశ్వాసంలోకి తీసుకోకపోవడం ఓటమికి దారితీసిందని కొందరు చెప్పారు.
అన్నింటికన్నా ముఖ్యంగా అమిత్ షా వల్లే ఘోరంగా ఓటమి పాలైనట్లు మెజారిటీ శాతం నాయకులు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో చాలా జాప్యం జరగడం కూడా పార్టీని బాగా దెబ్బతీసిందని కొందరు చెప్పారు. ఇక ప్రధాని మోడీ వ్యవహారశైలి కూడా ఢిల్లీ ఓటమికి ఓ కారణమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ప్రధాని స్థాయి వ్యక్తి ఓ నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్నీ ఢిల్లీ ప్రజలు హర్షించలేదని పేర్కొన్నారు. మోడీ ఎంతో ఖరీదైన సూట్ ధరించి ఎన్నికల ర్యాలీలలో పాల్గొనడం కూడా ఢిల్లీ ప్రజలకు రుచించలేదని కొందరు చెప్పారని తెలుస్తోంది. కేజ్రీవాల్కు రోజూ వేసిన ఐదు ప్రశ్నలు కేజ్రీవాల్కు నష్టం చేయకపోగా.. బీజేపీనే ఎదురుదెబ్బ తీసిందని పలువురు అభిప్రాయపడ్డారు.
షారూక్ ఖాన్ ఇంటి వద్ద నిర్మించిన ర్యాంప్ తొలగింపు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ముంబైలో తన ఇంటి వద్ద నిర్మించిన ర్యాంప్ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా నిర్మించిన ర్యాంప్ను తొలగించకుంటే తామే కూల్చివేస్తామని అధికారులు గతంలోనే షారుక్ ఖాన్కు నోటీసులు జారీ చేశారు. షారుఖ్ స్పందించక పోవడంతో కార్పొరేషన్ అధికారులు పొక్లెన్ సాయంతో ర్యాంప్ను తొలగించారు.