గోల్డెన్ గర్ల్, వివాదాల రాణి: నటి, ఎంపి రమ్య ప్రొఫైల్
హైదరాబాద్/బెంగళూరు: సినీ కథానాయికగా సత్తా చాటిన రమ్య దివ్య స్పందన అలియాస్ రమ్య ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2013లో కర్ణాటకలోని మాండ్య పార్లమెంటరీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. లోకసభలో తొలిసారి ప్రసంగించిన ఆమె రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి సీనియర్ల అభినందనలు అందుకున్నారు.
రమ్య దివ్య స్పందన నవంబర్ 29, 1982లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రంజిత, నారాయణ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమ్య తల్లిదండ్రులు కర్ణాటకలో స్థిరపడ్డారు. తమిళనాడులోని ఊటిలోని సెయింట్ హిల్దాస్ పాఠశాల, సాక్రెడ్ హార్ట్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఆమె తన ఉన్నత చదువును బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఆమె తన చదువుకు ముగింపు పలికారు.
కాగా, 2003లో తన తండ్రి సహకారంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రమ్య.. కన్నడంలోనే కాక తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు. 2003లో తొలిసారి కన్నడ చిత్రం ‘అభి' చిత్రంతో ఆమె నాయికగా తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో కథనాయకుడిగా పునీత్ రాజ్కుమార్ నటించారు. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలు కమర్షియల్ విజయవంతం కావడంతో ఆమెకు పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. 2003లోనే తెలుగులో ‘అభిమన్యు' సినిమాలో నాయికగా నటించారు. ఈ చిత్రంలో రమ్య నటనకు మంచి స్పందన వచ్చింది.
2005లో ‘అమృతధారే' కన్నడ చిత్రంలో నటనకు గాను రమ్యకు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 2006లో థననం..థననం చిత్రంలో వనజ నటించిన రమ్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 2007లో ప్రారంభ అనే షార్ట్ పిల్మ్లో కూడా ఆమె నటించింది. సంజు వెడ్స్ గీతా చిత్రంలో గీతగా నటించి మెప్పించిన రమ్యకు కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అంతేగాక ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా రమ్య గెలుచుకున్నారు.
2011లో ఉత్తమ నటిగా 12 టెలివిజన్ అవార్డులను రమ్య సొంతం చేసుకున్నారు. రమ్య 2011లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. 2013లో అశ్వినీ నక్షత్ర అనే టెలీ సీరియల్లో కూడా ఆమె నటించారు. రమ్య దివ్య స్పందనకు ‘గోల్డెన్ గర్ల్ ఆఫ్ కన్నడ సినిమా' అని కూడా పేరుంది. అంతేగాక ఆమెకు వివాదాల రాణిగా కూడా పిలుస్తుంటారు.
రమ్య నటిగా ఉన్న సమయంలో తనకు నచ్చని అంశాలపై సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, సహా నటులతో ఎప్పుడూ వివాదాలకు దిగేవారు. తన రెమ్యూనరేషన్ విషయంలో అసలే వెనక్కితగ్గేవారు కాదు. ఒకానొక సమయంలో ఆమెపై కన్నడ సినీ పరిశ్రమ నిషేధం విధించింది. అయితే ప్రముఖ నటుడు అంబరీష్ కలగజేసుకోవడంతో నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత రమ్య రాజకీయాల్లోకి ప్రవేశించించారు. 2013లో మాండ్య పార్లమెంటరీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె 15వ లోక్సభకు ఎన్నికయ్యారు.