వేధింపులను ఎదుర్కొంది..విజయం సాధించింది: కేరళ దళిత ఎంపీ కథ ఇది
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 52 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. ఇందులో రమ్యా హరిదాస్ ఒకరు. ఇంతకీ ఈ రమ్యా హరిదాస్ ఎవరు..?
కేరళ నుంచి రెండో దళిత ఎంపీ రమ్యా హరిదాస్
రమ్యా హరిదాస్..కేరళకు చెందిన ఓ దళిత ఎంపీ. తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ సారి కేరళ నుంచి లోక్సభకు ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీగానే రికార్డు క్రియేట్ చేయలేదు...ఆ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎంపికైన రెండో దళిత మహిళ కూడా రమ్యానే కావడం విశేషం. రమ్యా హరిదాస్ ఎల్డీఎఫ్ అభ్యర్థి పీకే బిజూను దాదాపు 1.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనకు మొత్తం 5,33,815 ఓట్లు వచ్చాయి.
ఆటపాటలతో ఓటర్లను ఆకట్టుకున్న రమ్యా
పేదరికాన్ని దగ్గర నుంచి చూసినట్లు చెప్పిన రమ్యా తాము ఓ పూరిగుడిసెలో నివాసం ఉండేవారమని చెప్పారు. ఇప్పటికీ తాము ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు రమ్యా తెలిపారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే ఈ రోజుల్లో తన తల్లి తనను ఎంతగానో ప్రోత్సహించిందని అండగా నిలిచిందని చెప్పారు హరిదాస్. ఇక ప్రచారంలో రమ్యా హరిదాస్ తన పాటలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. డాన్సులతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇలా చేయడంపై కమ్యూనిస్టు నేతలు ఆమెను విమర్శించారు. అదే ఆమెకు వరం అయ్యింది. ఇక ప్రచారంలో భాగంగా ఆమెపై నీచమైన కామెంట్స్ కూడా చేశారు ఎల్డీఎఫ్ కన్వీనర్ విజయరాఘవన్.
పార్లమెంటులో మహిళల సమస్యలపై పోరాడుతాను
ఇక తనలా మరో మహిళపై అలాంటి కామెంట్లు రాకూడదంటే తాను ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు రమ్యా. ఈ క్రమంలోనే తనకు మహిళల నుంచి మంచి మద్దతు లభించింది. పార్లమెంటులో మహిళల గళాన్ని వినిపిస్తానని చెప్పారు. అంతేకాదు యువతకు ఉపాధిపై వ్యవసాయ సంక్షోభంపై పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తానని అన్నారు రమ్యా. రాజకీయాల్లో రాణించాలనే మహిళలకు రమ్యా ఒక శక్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.