టిక్కెట్ ఇస్తారా లేదా, రమ్యకు ఆ పదవి సరిపోదు: కాంగ్రెస్కు తల్లి రంజిత అల్టిమేటం
మాండ్య: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్, మాండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య తల్లి రంజిత ఆ పార్టీకి షాకిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కీలక నేత అయిన రమ్య తల్లి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
రమ్య తల్లి రంజిత డిమాండ్
వచ్చే ఎన్నికల్లో మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ తనకు ఇవ్వాలని రమ్య తల్లి రంజిత డిమాండ్ చేశారు. మాండ్య నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, తనకు టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నానని చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేశారు.
ముఖ్యమైన పదవే కానీ
తన కూతురు రమ్య ఏఐసీసీ సోషల్ మీడియా సెల్ చూస్తున్నారని, ఇది ముఖ్యమైన పోస్ట్ అని తనకు తెలుసునని తల్లి రంజిత అన్నారు. కానీ మాండ్య ప్రజలకు ఇవన్నీ అర్థం కావన్నారు. రమ్యకు పార్టీలో కీలక పోస్ట్ ఇచ్చారా లేరా అని మాత్రమే ప్రజలు చూస్తారన్నారు.
రెండు డిమాండ్లు
28 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నా తనకు ఒరిగిందేమీ లేదని రంజిత అన్నారు. తన కుమార్తె పార్టీ కోసం బాగా కష్టపడుతోందని చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వాలని, తన కూతురుకు పార్టీలో మంచి పదవి ఇవ్వాలన్నారు.
అప్పుడే రమ్య ఏమైనా చేస్తుంది
అప్పుడే రమ్య మాండ్య ప్రజలకు ఏమైనా చేయగలుగుతుందని రంజిత అన్నారు. రమ్యకు మరింత మంచి పదవి రావాలన్నారు. మాండ్య ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు ఆమెకు పదవి కావాలన్నారు. రాష్ట్ర పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరింత సమర్థవంతంగా
రమ్యకు రాష్ట్రంలో పదవి ఇస్తేనే మరింతగా సమర్థవంతంగా పని చేసేందుకు వీలుంటుందని రంజిత అన్నారు. కాగా, తల్లి వ్యాఖ్యలపై స్పందించేందుకు రమ్య నిరాకరించారు. అదే విధంగా మాండ్య నుంచి తానే స్వయంగా పోటీ చేయాలని రమ్య భావిస్తున్నట్లు కథనాలు రాగా.. వాటిని ఆమె కొట్టి పారేశారు.