భారీగా నిధులు మళ్లింపు: పోలీసుల అదుపులో రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుశాఖలోని ఆర్థికనేర విభాగం ప్రముఖ ఔషధ కంపెనీ రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ను అదుపులోకి తీసుకుంది. రూ.740 కోట్లమేరా మోసం జరిగిందనే ఆరోపణలపై శివేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెలిగేర్ఫిన్వెస్ట్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే పాటియాలా కోర్టులో ఇద్దరిని పోలీసులు హాజరుపర్చనున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి శివేందర్ సింగ్ సోదరుడు మల్వీందర్ సింగ్ పేరును కూడా పోలీసులు చేర్చారు. ఇద్దరూ కలిసి రూ.740 కోట్లు నిధులు మళ్లించారని రెలిగేర్ ఫిన్వెస్ట్ సంస్థ ఆరోపణలు చేసింది.
ప్రస్తుతం మల్వీందర్ సింగ్ లుధియానాలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శివేందర్ సింగ్, మల్వీందర్ సింగ్, సునీల్ గోద్వానీల త్రయం రాన్బాక్సీ సంస్థను దైచీ సాన్క్యోకు విక్రయించారు. ఆగష్టు 2019లో రాంబాక్సీ ప్రమోటర్లుగా ఉన్న సమయంలో వీరి ఆస్తులపై సోదాలు నిర్వహించింది ఈడీ. మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యాక ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్లో మల్వీందర్ సింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో తన సోదరుడు శివేందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అదే సమయంలో ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు మీటింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించాడు.
ఫోర్టిస్ హెల్త్ కేర్ , రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ సంస్థలపై పట్టు కోల్పోయిన తర్వాత ఇద్దరి సోదరుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ బాహాటంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కూడా. గతేడాది సెప్టెంబరులో ఇద్దరూ విబేధాలు వీడి కలిసి పనిచేయాలని తన తల్లి చెప్పడంతో తాము విబేధాలను పక్కనబెట్టి కలిసి పనిచేస్తామని చెప్పారు. మరో మూడు నెలల సమయంలోనే తిరిగి విబేధాలు తారాస్థాయికి చేరాయి.
ఇదిలా ఉంటే రాన్బాక్సీ సంస్థను 2008లో డైచీ సంస్థ కొనుగోలు చేసింది. అయితే అదే సమయానికి రాన్బాక్సీ పై ఉన్న కేసు విషయాన్ని సోదరులు శివేందర్ సింగ్, మల్వీందర్ సింగ్లు దాచిపెట్టారు. దీనిపై సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్లో కేసు దాఖలు చేశారు. దీంతో ఆ కోర్టు రూ.4వేల కోట్లు డైచీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు పాటించకపోవడంతో డైచీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం మార్చి 14న రూ.4వేలు ఎలా చెల్లిస్తారో ఒక ప్రణాళికను ఇవ్వాల్సిందిగా సోదరులను కోరింది. అయితే దీనిపై స్పందించకపోవడంతో ఇద్దరిని జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.