ఆశ్చర్యం: 5 సబ్జెక్ట్లలో సేమ్ మార్కులు సాధించిన ట్విన్ సిస్టర్స్
రాంచీ: జార్ఖండ్ ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. కవలలైన అక్కా చెల్లెళ్లకు ఐదు సబ్జెక్టుల్లో సమానంగా మార్కులు వచ్చాయి. కేవలం ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఒక్క మార్కు తేడా వచ్చింది. దీంతో ఇరువురు కవల అక్కా చెల్లెళ్లు దాదాపు సమానం పర్సెంటేజ్తో ఉన్నారు.
అపురూప, అనురూపలు ఇద్దరు ట్విన్ సిస్టర్స్. వీరిద్దరు ఐసీఎస్ఈ పరీక్షల్లో 97.80, 98 పర్సెంటేజ్లతో పాస్ అయ్యారు. ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
వీరికి అయిదు సబ్జెక్టుల్లో సమాన మార్కులు వచ్చాయి. ఇరువురు కూడా... ఇంగ్లీష్లో 95, సామాన్య శాస్త్రం (సైన్స్)లో 99, గణితంలో 98, చరిత్రలో 97, భూగోళశాస్త్రంలో 97 మార్కులు వచ్చాయి.
ఒక్క హిందీలో మాత్రం అనురూపకు 98 మార్కులు రాగా, అపురూపకు 97 మార్కులు వచ్చాయి. వీరి తండ్రి పేరు శైలేష్ చటోపాధ్యాయ. అతను బిర్సా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంను బోధిస్తుంటారు.
ఈ అక్కా చెల్లెళ్లు ఎప్పుడు కూడా కలిసి చదువుతుంటారు. ఐసీఎస్ఈ పరీక్షలు మార్చి నెలలో జరిగాయి. పరీక్షల సమయంలో తామిద్దరం కలిసి చదివామని ఆ అక్కా చెల్లెళ్లు చెప్పారు.