రంగీళా గర్ల్ పొలిటికల్ ఎంట్రీ! లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ!
న్యూఢిల్లీ: బహుభాషా నటి ఊర్మిళా మతోండ్కర్.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆమె న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు- ఆమె కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ముంబై లోక్ సభ స్థానాన్ని ఊర్మిళకు కేటాయించవచ్చని తెలుస్తోంది.
అది మా ఘనతే! రాహుల్ గాంధీ: థియేటర్ డే శుభాకాంక్షలు అంటూ చురకలు
హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో ఊర్మిళా మతోండ్కర్ నటించారు. బాలీవుడ్ మూవీ రంగీళా సూపర్ హిట్ కావడంతో.. ఆమెకు రంగీళా గర్ల్ అనే పేరు స్థిరపడిపోయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. 2006లో చివరిసారిగా హిందీలో బస్ ఏక్ పల్ సినిమాలో నటించారు. అనంతరం అడపా దడపా కొన్ని మరాఠీ సినిమాల్లో కనిపించారు. ముంబైలో స్థిరపడిన జమ్మూకాశ్మీర్ కు చెందిన పారిశ్రామికవేత్త మోహసిన్ అఖ్తర్ మీర్ ను 2016లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా రాజకీయాల్లో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిలింద్ దేవ్ రా, సంజయ్ నిరుపమ్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ వంటి నాయకుడి అవసరం ఉందని అన్నారు. అన్ని వర్గాల వారినీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఇప్పుడున్న పాలకుల్లో కొరవడిందని చెప్పారు. సినిమా కళాకారులు రాజకీయాల్లో చేరితే, అందరి కళ్లూ వారి మీదే ఉంటాయని అన్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఊర్మిళ అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. మహారాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 29వ తేదీన నాలుగో దశలో ముంబై పరిధిలోని అన్ని లోక్ సభ స్థానాలు సహా, మరికొన్నింటికి పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఉత్తర ముంబై స్థానం నుంచి ఊర్మిళా పోటీ చేయవచ్చని తెలుస్తోంది.