నటి రమ్యా తల్లి డిమాండ్: ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ కూతురికి, లేదా తనకే: తేల్చండి !
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, మాజీ ఎంపీ, నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందనకు అవకాశం ఇవ్వాలని ఆమె తల్లి రంజిత ఆ పార్టీ పెద్దలకు మనవి చేస్తున్నారు. లేదంటే తనకే టిక్కెట్ ఇవ్వాలని రంజిత డిమాండ్ చేస్తున్నారు.
నటి రమ్యాకు అవకాశం ఇవ్వకుంటే తాను పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని రంజిత డిమాండ్ చేస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5 లక్షల ఓట్లు ఉన్నాయని, గతంలో రమ్యా ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారని రంజిత గుర్తు చేశారు.
గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం స్వల్ప మెజారిటీతో రమ్యా ఓడిపోయారని, ఇప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తారని రంజిత ధీమా వ్యక్తం చేశారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో రమ్యా పోటీ చెయ్యడానికి అవసరమైన అఫిడవిట్లను ఆమె తల్లి రంజిత తన న్యాయవాదులతో సిద్దం చేయిస్తున్నారు.
రమ్యా ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నారని, అందువలన ఇక్కడ మీరే పోటీ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నారని ఇటీవల రంజిత మీడియాకు చెప్పారు. అయితే రమ్యాకు కాని, ఆమె తల్లి రంజితకు కాని ఎన్నికల్లో పోటీ చెయ్యడానకి అవకాశం ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తామని మండ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.