రేపిస్టును జైల్లోంచి లాగి, అడ్డంగా కొట్టి చంపారు
కోహిమా: అత్యాచారం కేసు నిందితుడికి వ్యతిరేకంగా ప్రజలు రెచ్చిపోయారు. ఓ రేపిస్టును అడ్డంగా కొట్టి చంపారు. జైలు గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లి బయటకు లాక్కొచ్చి మరీ పట్టణంలో ఊరేగించి చంపారు. ఈ సంఘటనను జైలు వాచ్మన్ ప్రేక్షకుడై చూశాడే తప్ప ఏం చేయలేకపోయాడు. ఈ సంఘటన నాగాలాండ్లోని దీమాపూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
నిపోయిన వ్యక్తిని బంగ్లాదేశ్కు చెందిన సయ్యద్ ఫరీద్ ఖాన్ అని చెబుతున్నారు. దీమాపూర్లో ఫిబ్రవరి 23న ఓ బాలికపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని జైలులో వేశారు. అయితే అత్యాచారం సంఘటనపై ఉడికిపోయిన స్థానికులు జైలులోకి గేట్లు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. నిందితుడిని బయటకు కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. అంతా చూస్తుండగానే చంపేశారు.
నిందితుడు ఫిబ్రవరి 23వ తేదీన అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు బ్లాంక్ ఫైరింగ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ వదిలారు. అయినా గుంపును నియంత్రించలేకపోయారు. రేపిస్టును ప్రజలు నగ్నంగా బయటకు లాక్కుని వచ్చి తీవ్రంగా కొట్టారు.
ఈ సంఘటనపై సాయంత్రం ఏడు గంటలకు అత్యవసరంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దీమాపూర్లో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించింది. హింసాత్మక సంఘటనను మంత్రివర్గం ఖండించింది. సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీని విచారణ నిమిత్తం నియమించింది.