షాక్:మంత్రి ఇంట్లో సోదాలు, అత్యాచార ఆరోపణలే కారణం?
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గాయత్రి ప్రజాపతి ఇంట్లో మంగళవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు.
లక్నో:అత్యాచార ఆరోఫణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గాయత్రి ప్రజాపతి ఇంట్లో మంగళవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు సోదాలు జరిపారు.
తనపై , తన మైనర్ కూతురిపై గాయత్రి ప్రజాపతితో పాటు ఆయన అనుచరులు లైంగిక దాడులకు పాల్పడ్డారని ఓ మహిళ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు.
దీంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రి ప్రజాపతి ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ప్రజాపతితో పాటు ఆయన ఆరుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇవాళ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించామని త్వరలోనే ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాయత్రి ప్రజాపతిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.దీంతో ఎన్నికల ప్రచారసభలో తన పక్కన ప్రజాపతి లేకుండానే యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జాగ్రత్తలు తీసుకొన్నారు.