రేప్ కేసు: వివాదాస్పద స్వామి నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ!
బెంగళూరు: అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామిజీ నిత్యానందకు కర్ణాటకలోని రామనగర సెషన్స్ కోర్టు షాకిచ్చింది. గత రెండు నెలల నుంచి కోర్టు విచారణకు హాజరుకాకుండా న్యాయవాదితో కేసు వాయిదాలు వేయించుకుంటున్న నిత్యానందకు రామనగర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
కోర్టు విచారణకు హాజరుకాకుండా నిత్యానంద పరారీలో ఉన్నాడని న్యాయమూర్తి అన్నారు. తదుపరి కేసు విచారణకు నిత్యానంద కోర్టు ముందు తప్పకుండా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిత్యానంద మీద అత్యాచారం కేసు 2010లో నమోదు అయ్యింది.
తన మీద నిత్యానంద అత్యాచారం చేశాడనని, ఆసమయంలో ఆయనకు అనేక మంది సహకరించారని ఓ మహిళ 2010లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేసి నిత్యానందతో పాటు ఐదు మందిని అరెస్టు చేశారు.
జైలు జీవితం గడిపిన నిత్యానంద తదితరులు తరువాత బెయిల్ మీద బయకు వచ్చారు. తమ మీద నమోదు అయిన కేసులు కొట్టి వెయ్యాలని నిత్యానంద, రెండో ఆరోపి గోపాల్ రెడ్డి, మూడో ఆరోపి నిత్య సచ్చిదానంద, మరో ఇద్దరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిత్యానంద తదితరులు సమర్పించిన పిటిషన్ లను 2017లో సుప్రీం కోర్టు తిరస్కరించి కేసు విచారణ వేగవంతం చెయ్యాలని రామనగర కోర్టుకు సూచించింది. 2018లో రామనగర కోర్టులో నిత్యానంద మీద నమోదు అయిన కేసు విచారణ మొదలైయ్యింది.
నిత్యానంద మాత్రం విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ఆశ్రమంలో నిత్యానంద ఆచూకి లేదని, ఆయన కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు.
నిత్యానందతో పాటు అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపాల్ రెడ్డి, నిత్య సచ్చిదానంద మాయం అయ్యారని విచారణ చేస్తున్న అధికారులు అంటున్నారు. నిత్యానంద స్వామి వారణాసిలో దీక్ష చేస్తున్నారని, అందుకే విచారణకు హాజరుకాలేదని ఆయన న్యాయవాది కోర్టులో వాదించారు.